విజయవాడలో భారీ అగ్నిప్రమాదం: మంటలను ఆర్పుతున్న ఫైరింజన్లు
విజయవాడ: విజయవాడలోని ఆటోనగర్లో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. కానూరు రోడ్డులోని ఓ కూలర్ల కంపెనీలో ఈ ప్రమాదం సంభవించింది. మంటలు చుట్టుపక్కలకు నిమిషాల వ్యవధిలోనే వ్యాపించాయి. పక్కనే ఉన్న ఇంజిన్ ఆయిల్ మిక్స్ యూనిట్కు కూడ మంటలు వ్యాపించాయి. మంటలు పెరిగి పోవడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేశారు. ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.
సుమారు 10 ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నా రెండు గంటలు దాటినా కానీ, మంటలు అదుపులోకి రావడం లేదు. సమీపంలోనే విద్యుత్ సబ్ స్టేషన్ కూడ ఉంది. మంటలు సబ్ స్టేషన్ కు వ్యాపిస్తే పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

మంటలు పెరగకుండా ఉండేందుకు గాను ఫైరింజన్లతో అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు.
విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ లక్ష్మీకాంతం, పోలీసు కమిషన్ క్రాంతి రాణా సంఘటన స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మంటలు వ్యాపించిన ఆయిల్ ఫ్యాక్టరీలో సుమారు 100 డ్రమ్ముల్లో ఆయిల్ ఉంది. మంటలకు ఈ ఆయిల్ డ్రమ్ములు పేలిపోతున్నాయి.


Click it and Unblock the Notifications