మగాడొస్తాడు, ముళ్లకంచె: నేతల ఆసక్తికర వ్యాఖ్యలు
విభజన నిర్ణయం నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి అసెంబ్లీలో కంచె వేయాలంటూ వ్యాఖ్యానించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలను ఒక వైపున, సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలను మరోవైపున కూర్చోబెట్టి మధ్యలో ఇనుపముళ్ల కంచె వేయాలని అభిప్రాయపడ్డారు. బిల్లు అసెంబ్లీకి వచ్చే నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రెండు ప్రాంతాల వారు దాడులకు పాల్పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలనే డిమాండ్ పైన మంత్రి దానం నాగేందర్ మండిపడ్డారు. యూటి చేస్తే ఊరుకోవడానికి హైదరాబాద్ ప్రజా ప్రతినిధులు చేతకాని దద్దమ్మలం కాదని ధ్వజమెత్తారు. కేంద్రపాలిత ప్రాంతమంటారని అనుకొని ఉంటే తాము గ్రేటర్ హైదరాబాద్ను ప్రత్యేక రాష్ట్రం చేయాలని కోరేవారమని ఆయన అన్నారు.
ఇక టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విభజన సమస్య పరిష్కరించేందుకు మగాడు వస్తాడని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా విభజన సమస్యను పరిష్కరించే మగాడు వస్తాడని, వచ్చి చేసి చూపిస్తాడని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా విభజన చేయడం కాంగ్రెస్కు చేతగాదని తేలిపోయిందని, ప్రజలను ఏడిపించే బదులు పక్కన పడవేస్తే ఎన్నికల తర్వాత వచ్చేవాళ్లు చూసుకుంటారని అన్నారు.