అమ్మాయికి ఆశపడి గుంటూరులో దోపిడీకి గురైన కారు డ్రైవర్
గుంటూరు: అమ్మాయిల పేరిట ఓ కారు డ్రైవరుకు టోకరా వేసి ముగ్గురు వ్యక్తులు దోపిడీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం - ప్రకాశం జిల్లా యర్రగొండపాలేనికి చెందిన శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ ఈస్ట్ మారేడుపల్లిలోని ఓ ట్రావెల్స్లో డ్రైవర్గా పనిచేస్తుంటాడు.
మంగళవారం రాత్రి గుంటూరు కిరాయికి వచ్చి, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కారు నిలిపి, హైదరాబాద్ వైపు ప్రయాణికుల కోసం ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో ముగ్గురు యువకులు మంచి అమ్మాయిలు ఉన్నారు, వస్తావా అని అడిగారు. అమ్మాయికి ఆశపడిన శ్రీనివాసరెడ్డి ఆ ముగ్గురితో కలిసి ఆటో ఎక్కాడు.
నగరాలు ప్రాంతానికి తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో అతడిని కొట్టి రూ. 3వేలు లాక్కున్నారు. కిరాయి డబ్బులు ఇంకా ఎక్కువ ఉండాలిగా అంటూ మళ్లీ కొట్టారు. కారులో దాచానని చెప్పాడు. కారు వద్దకు వెళ్లి తీసుకుందామని తిరిగి ఆటోలో వస్తుండగా ఆటోలో డీజిల్ అయిపోయింది.
సరిగ్గా అదే సమయంలో చీకట్లో ఆగిన ఈ ఆటో వద్దకు నల్లపాడు బీట్ కానిస్టేబుళ్లు వెళ్లారు. దీనితో ముగ్గురు నిందితులు శ్రీనివాసరెడ్డిని వదిలి పారిపోయారు. శ్రీనివాసరెడ్డిని ప్రథమ చికిత్స చేయించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.