ఎన్నారై ఇంట్లో చోరీ: 39 లక్షల సొత్తు అపహరణ
దబీర్పురా ఇన్స్పెక్టర్ డివి రంగారెడ్డి కథనం ప్రకారం... గత 25 ఏళ్లుగా కెనడాలో ఉంటున్న మక్బుల్ అలీఖాన్ తన కుమారుడి వివాహాన్ని జరిపించేందుకు హైదరాబాద్లోని తన తల్లి ఉంటున్న ఇంటికి వచ్చారు. బుధవారం రాత్రి 11.30 గంటలకు వివాహ పనులు పర్యవేక్షించేందుకు కుటుంబ సభ్యులతోపాటు మక్బుల్ స్థానిక అంజుమన్ ఫంక్షన్ హాల్కి చేరుకున్నారు. కాగా అదే రాత్రి 1.05 గంటలకు తన ఇంటిపై ఎవరో అనుమానాస్పదంగా తిరుగుతున్నారని పొరుగువారు మక్బుల్కి ఫోన్ చెప్పారు.
దీంతో హుటాహుటిన మక్బుల్ కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఇంట్లోని 96 తులాల బంగారు నగలతోపాటు మిగితా విలువైన సామాగ్రితో దొంగలు పరారయ్యారు. అయితే ఇంట్లోని ఓ గది గ్రిల్ తలుపును వేయకపోవడంతో దొంగలు అక్కడి నుంచే ఇంట్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. గురువారం కుమారుడి వివాహం ఉన్న నేపథ్యంలో ఈ దోపిడీ జరగడంతో మక్బుల్ కుటుంబ సభ్యులు ఆవేదనకు గురయ్యారు. అయితే వివాహ షెడ్యూల్లో ఎలాంటి మార్పులు చేయలేదని పోలీసులు తెలిపారు.
మక్బుల్ వివాహం కోసం 200 తులాల బంగారాన్ని తీసుకొచ్చాడని, అందులో 96 తులాలు చోరీకి గురయ్యాయని పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా మరో కేసులో కెపిహెచ్బిలోని బ్యూటీ పార్లర్, ఫొటో స్టూడియో, టేలర్ షాపుల్లో చోరీలు జరిగాయని చెప్పారు.