ఆంధ్రప్రదేశ్ సోదరసోదరీమణులారా..: టీడీపీకి మోడీ కౌంటర్ వీడియో!!
న్యూఢిల్లీ: లోకసభలో ప్రధాని ఏపీకి హామీ ఏమీ ఇవ్వలేదన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సహా ఇతర నేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కౌంటర్ ఇచ్చారు. ఏపీకి తాను హామీ ఇచ్చిన వీడియోను పోస్టు చేశారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రధాని మోడీ గంటపాటు మాట్లాడిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఇతర అంశాలపై మాట్లాడాయి. దీంతో మోడీ వాటికి కౌంటర్ ఇస్తూ, ఏపీకి హామీ ఇచ్చారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయిన తర్వాత చంద్రబాబు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏపీకి హామీ ఇవ్వలేదని, రాజ్నాథ్ తనను స్నేహితుడు అని చెప్పే బదులు ఏమిచ్చామో, ఏం ఇవ్వలేదో చెబితే బాగుండేదన్నారు.
రాజ్నాథ్ సింగ్ తన ప్రసంగంలో ఏపీకి ఇచ్చిన పలు అంశాలను వివరించారు. మోడీ కూడా ఏపీకి హామీ ఇచ్చారు. టీడీపీ నేతల విమర్శలతో పాటు అవిశ్వాస తీర్మానం విభజన హామీల కోసం పెట్టినందున మోడీ లోకసభలో ఇచ్చిన హామీలకు సంబంధించి వీడియో పోస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్కు చెందిన నా సోదరీ, సోదరీమణులకు నేను హామీ ఇస్తున్నాను.. తమ ఎన్డీయే ప్రభుత్వం ఏపీ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉందన్నారు. లోకసభలో విజయం సాధించామని, తమకు 125 కోట్ల మంది భారతీయుల మద్దతు ఉందని కూడా మోడీ పేర్కొన్నారు. అస్థిరతను సృష్టించడానికి కాంగ్రెస్ ఎలా ప్రయత్నించిందో అంతా చూశారనని, 1999లోనూ, అంతకుముందూ అలాగే చేశారని, ఎన్డీయే సర్కారుకు మద్దతుగా నిలిచిన ప్రతి పార్టీకి కృతజ్ఞతలు అన్నారు.
I assure my sisters and brothers of Andhra Pradesh that the NDA Government will always work for their welfare and the state's growth. pic.twitter.com/4DOtN3YkWD
— Narendra Modi (@narendramodi) July 21, 2018