ఇక జగన్ నాకు డోంట్ కేర్.. తేల్చేసిన షర్మిల..!
ఏపీలో గత ఎన్నికల ముందు నుంచే అన్న వైఎస్ జగన్ తో విభేదిస్తూ వచ్చిన వైఎస్ షర్మిల ఇవాళ తమ వివాదాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. జగన్ ను ఇక లెక్క చేసేది లేదంటూ తేల్చిచెప్పేశారు. కుటుంబ వారసత్వంగా వచ్చిన ఆస్తుల విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరుపై మరోసారి షర్మిల నిప్పులు చెరిగారు. "తల్లిపై కేసు వేసిన కొడుకుగా.. మేనల్లుడి, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ మిగిలిపోతారంటూ వ్యాఖ్యానించారు.
తన బిడ్డలకు కుటుంబ ఆస్తులు ఇస్తున్నట్లుగా జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఎంవోయూలో సంతకం పెట్టారని షర్మిల తెలిపారు. కానీ ఇప్పటివరకూ ఎలాంటి ఆస్తులు తనకు ఇవ్వలేదన్నారు. సరస్వతీ సిమెంట్స్ లో తనకు వాటాగా వచ్చిన వాటాల్ని తన తల్లి విజయమ్మకు గిఫ్ట్ డీడ్ చేశారని, కానీ ఇప్పుడు తల్లి మీదే కేసు వేసి మోసం చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. జగన్ తనను ప్రభావితం చేసే స్థాయి దాటిపోయారని షర్మిల తెలిపారు. ఆయన తనకు ఆస్తులు ఇస్తాడా లేదా అన్నది డోంట్ కేర్ అన్నారు. దానిపై ఆలోచించడం లేదన్నారు.

ఇప్పటికే సరస్వతీ పవర్ వాటాల విషయంలో తల్లి విజయమ్మకు తాను బదిలీ చేసిన గిఫ్ట్ డీడ్ రద్దు చేయాలంటూ జగన్ హైదరాబాద్ లోని కంపెనీల జాతీయ లా ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. తాను గతంలో చెల్లెలు షర్మిలతో సంబంధాలు బాగున్నప్పుడు బదిలీ చేసిన వాటాల్ని ఇప్పుడు రద్దు చేయాలని ట్రైబ్యునల్ ను కోరారు. కానీ విజయమ్మ మాత్రం అవి తమ కుటుంబ ఆస్తులని, వాటిని కోరే అధికారం జగన్ కు లేదని ట్రైబ్యునల్ కు దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్నారు.
ఈ వివాదం నడుస్తున్న నేపథ్యంలో షర్మిల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా ఆ కేసు గెలుస్తామన్న ధీమా సడలిపోవడం వల్లే షర్మిల ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ మొదలైంది. లేకపోతే ట్రైబ్యునల్ తీర్పు రాకముందే షర్మిల ఇలా జగన్ ను డోంట్ కేర్ అంటూ ఎందుకు చెప్పారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications