‘‘నన్ను అనరాని మాటలు అన్నారు, నా జీవితంలో ఇలాంటి ప్రతిపక్షాన్ని చూడలేదు’’
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో విపక్షనేత జగన్మోహన్రెడ్డి తనను అనరాని మాటలన్నారని, తన రాజకీయ జీవితంలో వైసీపీ లాంటి ప్రతిపక్షాన్ని చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.
అమరావతి: నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో విపక్షనేత జగన్మోహన్రెడ్డి తనను అనరాని మాటలన్నారని, తన రాజకీయ జీవితంలో వైసీపీ లాంటి ప్రతిపక్షాన్ని చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.
మంగళవారం విజయవాడలో జరిగిన తెలుగుదేశం పార్టీ వర్క్షాప్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... టీడీపీకి అండగా నిలబడిన నంద్యాల, కాకినాడ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
అలాగే నంద్యాలలో టీడీపీ ఓడిపోతుందని విషప్రచారం చేశారని, నంద్యాల, కాకినాడ ఫార్ములాను అన్ని చోట్ల అమలుచేయాలని ఆయన టీడీపీ నేతలకు ఉద్బోధించారు. అంతేగాక ప్రజల్లో అసంతృప్తి ఉన్నచోట కారణాలు అన్వేషించాలన్నారు.
రాబోయో సార్వత్రిక ఎన్నికలను పార్టీ కార్యకర్తలు సవాల్ గా తీసుకోవాలని, దైవాధీనంగా భావించవద్దని చంద్రబాబునాయుడు సూచించారు. బెజవాడలో వైసీపీ నేతలు గొడవపడి రోడ్డెక్కారని, తమ పార్టీ వెధవలను ప్రోత్సహించిందని వైసీపీ నేతలే అంటున్నారని చంద్రబాబు అన్నారు.
జగన్ లాంటి నాయకుడు ఉంటే అలాంటి నేతలనే ప్రోత్సహిస్తారని, నెల్లూరు, కాకినాడ బెట్టింగుల్లో ప్రతిపక్ష నేతలున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.