నన్ను నమ్మండి: ఆర్బీఐపై షాకిచ్చిన బాబు, నినాదాలు
నెల్లూరు: తనను నమ్మాలని, తానేంటి నిరూపించుకుంటానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సంపూర్ణంగా సహకరిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటానని చెప్పారు.
శనివారం మధ్యాహ్నం నెల్లూరులో మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ అధ్యక్షత వహించిన సభలో బాబు అర్ధగంటపాటు సుదీర్ఘంగా ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదన్నారు. యూపీఏ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని, ఈ సమయంలో కేంద్రంలో మోడీ, ఏపీలో తాను బాధ్యతలు చేపట్టామన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేనందునే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురౌతున్నాయని, ఆలస్యమైనా ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడంలో వెనుకంజవేసే ప్రసక్తే లేదన్నారు. సన్న, చిన్నకారు రైతులందరికీ ఇంటికొక రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు.
చంద్రబాబు ప్రసంగిస్తున్నప్పుడు డ్వాక్రా రుణాలు రద్దు చేయాలంటూ కొందరు మహిళలు నినాదాలు చేయడంతో వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ లోటును కేంద్రమే భరిస్తుందని చంద్రబాబు చెప్పారు. డ్వాక్రా పథకాన్ని తమ ప్రభుత్వమే ప్రవేశపెట్టిందని, వారి రుణాలను రద్దు చేయడం కూడా తమ ప్రభుత్వమే చేస్తుందని మహిళలకు భరోసా ఇచ్చారు.
రుణాల రీషెడ్యూల్కు సంబంధించి ఏపిలో ఆర్బీఐ ముందుకొస్తే ఇతర రాష్ట్రాల్లో కూడా సమస్యలు తలెత్తుతాయన్న భావనతో ఆర్బీఐ ఆచితూచి వ్యవహరిస్తోందని ఓ షాకిచ్చారు. రుణమాఫీపై జరుగుతున్న జాప్యాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని, త్వరలోనే హామీలు పూర్తిచేసి వారి విమర్శలకు సమాధానం చెపుతానన్నారు.












Click it and Unblock the Notifications