వాయు'గండం', ఇక అతి భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తీవ్ర హెచ్చరిక..!!
దీపావళి పండుగ వేళ కీలక అప్డేట్. రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. రానున్న నాలుగు రోజుల అనంతరం దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది మంగళవారం నాటికి అల్పపీడనంగా బలపడి, ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
బంగాళాఖాతంలో అల్ప పీడన ద్రోణి కారణంగా ఈ రోజు.. రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు అక్టోబర్ 20న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి.. అలాగే 21వ తేదీన పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి.. ఇక 22వ తేదీన బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది.

అక్టోబర్ 23న కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు, రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలోని అన్ని జిల్లాలకు వాతావరణ కేంద్ర ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ రోజు, రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి ఉరుములతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీంతో.. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న సమయంలో.. తాజాగా విపత్తుల నిర్వహణ శాఖ అలర్ట్స్ తో యంత్రాంగం అప్రమత్తం అయింది.












Click it and Unblock the Notifications