ఇండియా కోలుకుంటోంది: కరోనా టాప్-5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కీలకంగా, ఇదే కొనసాగితే..
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు మరింతగా పెరుగుతున్నాయి. రోజుకు సమారు 90వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల్లో కేవలం ఐదు రాష్ట్రాల నుంచి నమోదవుతున్న కేసులే సగం కంటే ఎక్కువగా ఉన్నాయి. అయితే, కోలుకుంటున్నవారి సంఖ్య కూడా భారీగానే ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు.

ఏపీలో భారీగా రికవరీ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత మూడు వారాలుగా యాక్టివ్ కేసుల్లో 30 శాతం తగ్గుదల నమోదు కావడం గమనార్హం. సెప్టెంబర్ 10 వరకు ఏపీలో ప్రతి రోజూ 10వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కొద్ది రోజుల నుంచి 8వేల కంటే తక్కువ కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు 10వేల మందికిపైగా ప్రతి రోజూ కోలుకుంటున్నారు. రోజువారీ కరోనా కేసుల వృద్ధిరేటు 2.5 శాతం నుంచి 1.5 శాతానికి కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.

ఏపీతోపాటు ఈ ఐదు రాష్ట్రాల్లో..
ఇక మహారాష్ట్రలో కూడా గత వారం రోజులుగా యాక్టివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి.
3 లక్షలకుపైగా ఉన్న యాక్టివ్ కేసులు ఇప్పుడు 2.75 లక్షలకు తగ్గింది. తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి. జాతీయ స్థాయిలో కూడా ఇదే విధంగా ఉంది. గత ఆరు రోజులుగా కరోనా కొత్త కేసుల కంటే కూడా కోలుకున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. సెప్టెంబర్ 17న 10.17 లక్షల యాక్టివ్ కేసులుండగా.. ఇప్పుడు 9.66 లక్షలకు తగ్గింది. కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి కూడా ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. యాక్టివ్ కేసుల్లో భారీ మొత్తంలో తగ్గుదల నమోదు కావడం ఊరటనిస్తోంది.

టెస్టుల సంఖ్య కొంత మేర తగ్గినా..
గత వారం రోజుల నుంచి కరోనా టెస్టులు తగ్గించడం కూడా ఇందుకు ఒక కారణంగా తెలుస్తోంది. సెప్టెంబర్ మొదటి వారాల్లో చేసినన్నీ టెస్టులు చివరి వారంలో చేయకపోవడం గమనార్హం. అయితే, పెద్ద వ్యత్యాసమేమీ కాదు. గత వారం రోజుల్లో సగటున 9.81 లక్షల కరోనా టెస్టులు చేయగా.. గత పది రోజుల్లో దాని సగటు 10.94గా ఉంది. గత రెండు వారాలుగా ప్రతి రోజూ కొత్తగా 90వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. సెప్టెంబర్ 5న మొదటిసారి 90వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 75వేల నుంచి 98వేల మధ్య కొత్త కేసులు నమోదవుతున్నాయి.

ఇలాగే కొనసాగితే..
గత వారం రోజులుగా కోలుకున్నవారి సంఖ్య కూడా భారీగా ఉంటోంది. సోమవారం లక్ష మందికిపైగా కరోనా నుంచి కోలుకోవడం విశేషం. కొత్త కేసుల కన్నా కోలుకున్న వారి సంఖ్య ఎక్కువ ఉంటుండటం శుభపరిణామంగా చెప్పవచ్చు. ఈ విధంగా దీర్ఘకాలంపాటు కొనసాగితే దేశంలో కరోనా తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లే. ఢిల్లీలో భారీ ఎత్తులో కేసులు నమోదైనప్పటికీ.. ఇప్పుడు కొత్త కేసులు చాలా తక్కువ సంఖ్యలో నమోదవుతుండటం గమనార్హం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొత్త కేసుల కంటే కూడా ఎక్కువ సంఖ్యలో కోలుకుంటున్నారు. దీంతో ఆ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది.

కరోనా నియంత్రణలో ఇప్పటికీ భారత్ ఉత్తమమే..
బుధవారం దేశ వ్యాప్తంగా 86వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 87,300 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు
57.32 లక్షల మందికి కరోనా సోకింది. వీరిలో 46.74 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. అంటే దాదాపు 82 శాతం రికవరీ రేటు ఉంది. ఇక ఇప్పటి వరకు 91,500 మంది కరోనాతో మరణించారు. ప్రతిరోజు సుమారు 1000 మరణాలు నమోదవుతున్నాయి. ప్రపంచంలో మిగితా దేశాలతో పోల్చుకుంటే మనదేశంలో మరణాల రేటు కూడా చాలా తక్కువగా ఉంది.












Click it and Unblock the Notifications