కీలక నిర్ణయం తీసుకున్న భారతీయ రైల్వే
భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం జులై ఒకటో తేదీ నుంచి తర్వాత సంవత్సరం జూన్ 30 తేదీ వరకు చెల్లుబాటు అయ్యేలా 'ట్రెయిన్స్ ఎట్ గ్లాన్స్' పేరతో టైమ్ టేబుల్ విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం మాత్రం విడుదల చేయడంలేదని రైల్వే వెల్లడించింది. రైళ్ల రాకపోకలకు సంబంధించి టైంటేబుల్ వివరాల్లో ఎటువంటి మార్పులు ఉండవని, డిసెంబరు 31వరకు ఇదే టైంటేబుల్ కొనసాగుతుందని తెలిపింది. దీనికి సంబంధించి అన్ని జోన్లకు సర్క్యులర్ జారీచేసింది. ప్రస్తుతం రైళ్ల సమయాలకు సంబంధించిన పరిస్థితులన్నింటినీ సమీక్షిస్తున్నామని, టైంటేబుల్ ను మరింత సౌకర్యవంతంగా రూపొందించేందుకు రైల్వే బోర్డు భావిస్తోందని పేర్కొంది.
కొత్తది తీసుకురావాలని..
ప్రతి ఏడాది విడుదల చేసే రైల్వే టైంటేబుల్ బుక్ కు విపరీతమైన ప్రజాదరణ ఉంది. ఏ జోన్ పరిధిలో ఎన్ని రైళ్లు తిరుగుతున్నాయి, వాటి సమయాలు.. ఇలా అన్ని వివరాలు అందులో పొందుపరుస్తారు. రైలు ప్రయాణికుల్లో 90 శాతం మంది వీటిని కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది మాత్రం అలానే పాతది కొనసాగించి జనవరి నుంచి డిసెంబరు వరకు అందుబాటులో ఉండేలా కొత్త టైంటేబుల్ తీసుకురావాలనే యోచనలో అధికారులున్నారు.

అందుబాటులో ఆధునిక సౌకర్యాలు
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికుల కోసం రైల్వే అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ కోవలోనే వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్లను తీసుకురాగా వచ్చే ఏడాది చివరకు లేదంటే 2026లో ముంబయి-అహ్మదాబాద్ మధ్య బులెట్ రైలును ప్రవేశపెడుతోంది. ప్రమాదాలను నివారించేందుకు కవచ్ అనే వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీనివల్ల పట్టాలపై ఎదురెదురుగా రెండు రైళ్లు వచ్చినా డీకొట్టుకోకుండా ఉండేలా ఇది నిరోధిస్తుంది. డబుల్ లైన్ వల్ల కూడా రద్దీగా ఉండే మార్గాల్లో మూడో లైను నిర్మాణం చేస్తోంది. ఏపీలో విజయవాడ-గూడూరు, విజయవాడ-విశాఖపట్నం మధ్య మూడో లైను త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. కాలానుగుణంగా తమను తాము మార్చుకుంటూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించడమే తమ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications