టిడిపికి 40 మంది పారిశ్రామికవేత్తల ప్రచారం, కిరణ్ ఫైర్
హైదరాబాద్/అదిలాబాద్: తెలుగుదేశం పార్టీ తరఫున సీమాంధ్రలో పలువురు పారిశ్రామికవేత్తలు ప్రచారం చేయనున్నారు. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని వారు ప్రజల్లోకి తీసుకు వెళ్లనున్నారు. గురువారం చంద్రబాబుతో పలువురు పారిశ్రామికవేత్తలు భేటీ అయ్యారు.
భేటీ అనంతరం మాట్లాడుతూ... సీమాంధ్రలో టిడిపి తరపున ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సీమాంధ్రను అభివృద్ధి చేసే నాయకుడినే ఎన్నుకోవాలని, బాబుకే ఆ సామర్థ్యం ఉందన్నారు. భవిష్యత్తులో సీమాంధ్రలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. బస్సు యాత్ర ద్వారా 40 మంది పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలు ఈ ప్రచారంలో పాల్గొంటారు.

కిరణ్ ఆగ్రహం
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి గురువారం చంద్రబాబు, జగన్, కాంగ్రెసు పార్టీల పైన నిప్పులు చెరిగారు. ఆయన అనంతపురం జిల్లా కదిరిలో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని విడగొట్టేందుకు బాబు లేఖ ఇచ్చారని ఆరోపించారు. తన వల్లే విభజన జరిగిందని వరంగలర్ జిల్లాలో చెప్పిన చంద్రబాబు... సిగ్గు ఉంటే కదిరిలో చెప్పగలరా అని ప్రశ్నించారు.
పిల్లనిచ్చిన మామనే మోసం చేసిన గొప్ప చరిత్ర గల నాయకుడు చంద్రబాబు అన్నారు. మతతత్వ, విభజనలో భాగస్వామ్యం అయిన బిజెపితో బాబు ఎలా కలుస్తారని ప్రశ్నించారు. విభజనతో ఇరు ప్రాంతాలకు నష్టమే అన్నారు. 57 ఏళ్ల తర్వాత విడిపోవాలంటే బాధేస్తోందన్నారు. తెలుగు జాతికి అన్యాయం జరుగుతోందని చెప్పిన బిజెపి విభజనకు మద్దతుగా నిలబడిందని విమర్శించారు.












Click it and Unblock the Notifications