జాతి వైరాన్ని మరచి పంది పిల్లలకు పాలిస్తున్న శునకం .. ఇంట్రెస్టింగ్ కదూ!!
సహజంగా పందులకు, కుక్కలకు అస్సలు పడదు. పందులు కనిపిస్తే కుక్కలు వెంట పడతాయి. కుక్క పిల్లలు కనిపిస్తే పందులు కసితీరా గాయపరచి చంపేస్తాయి. అలాంటిది జాతి వైరాన్ని మరచి పంది పిల్లలకు పాలు ఇచ్చింది ఓ శునకం. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో పంది పిల్లలకు పాలిచ్చి అమ్మగా మారి వాటి ప్రాణాలను కాపాడుతున్న ఓ శునకంపై స్థానికంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
జంతువులు కూడా ఒక నిర్దిష్ట సమయంలో తమ భావోద్వేగ కోణాన్ని ప్రదర్శిస్తాయి. అవి ఇతర వర్గాల జంతువుల పట్ల కూడా తమ ప్రేమ మరియు ఆప్యాయతను చూపుతాయి అని అనేక సందర్భాలలో నిరూపితమైంది. తాజాగా అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. జాతి వైరాన్ని మరచి పంది పిల్లల కుక్కలు పాలిచ్చిన సంఘటనలు, కుక్క పిల్లలకు పందులు పాలించిన సంఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట, గండేపల్లి మండలం నీలాద్రి రావు పేట గ్రామంలో ఓ కుక్క జాతి వైరాన్ని మరచి పంది పిల్లలకు పాలు ఇచ్చింది. మాతృత్వాన్ని పంచింది.
జక్కమ్మ చెరువు ప్రాంతంలో పందులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. ఆ ప్రాంతంలో తిరుగుతున్న ఓ శునకం, అక్కడ తిరుగుతున్న రెండు పంది పిల్లలకు పాలిచ్చి పెంచుతోంది. పంది పిల్లలు కుక్క పాలు తాగడం చూసిన చుట్టుపక్కల వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. సహజంగా కుక్కలకు పందులకు ఏమాత్రం పడదు. అయినప్పటికీ ఓ కుక్క పంది పిల్లలకు పాలివ్వడం ఆసక్తికర పరిణామం. ఇదంతా వింతగా భావించి చుట్టుపక్కల జనాలు కుక్క పంది పిల్లలకు పాలిచ్చే దృశ్యాన్ని చూడడానికి వస్తున్నారు.
ఇదే విధంగా గతంలో కూడా కుక్క పిల్లలకు ఓ పంది జాతి వైరాన్ని మరచి తన స్తన్యాన్ని అందించింది. రోడ్డు ప్రమాదంలో కుక్క చనిపోగా అది గమనించిన ఓ పంది, ఆ కుక్క పిల్లలకు అమ్మ అయ్యింది. కుక్క పిల్లలకు పంది పాలిస్తూ అమ్మతనాన్ని చాటుకుంది. గతంలో సింగనమలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు అనేకం తారసపడుతున్నాయి. జంతువులు జాతి వైరాన్ని మర్చిపోతుంటే మనుషులు మాత్రం చిన్న చిన్న కారణాలకే హత్యలు చేస్తూ ప్రాణాలు తీస్తున్నారు. కక్షలు, కార్పణ్యాలతో రెచ్చిపోతున్నారు.