థియేటర్లపై దాడులు-ఏపీలో ఆసక్తికర చర్చ-ఇన్నేళ్లు వదిలేసి ఒక్కసారిగా బీభత్సం
ఏపీలో వైసీపీ ప్రభుత్వం సినిమా థియేటర్లపై చేపడుతున్న తనిఖీలు, మూసివేతలపై టాలీవుడ్ లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఇవాళ హీరో నాని చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఇప్పటికే సినిమా టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చిరంజీవి వంటి వారు ప్రభుత్వానికి విజ్ఞాపనలు పంపారు. అలాగే థియేటర్లు హైకోర్టును కూడా ఆశ్రయించాయి.. ఇలాంటి సమయంలో ప్రభుత్వం చేపడుతున్న దాడులతో సినీ పరిశ్రమవర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

థియేటర్లలో తనిఖీలు
ఏపీలో సినిమా థియేటర్లలో టికెట్ రేట్లు, ఆన్ లైన్ విధానం అమలు, సౌకర్యాలు, క్యాంటీన్లలో ధరలు వంటి అంశాల్ని తనిఖీ చేసేందుకు అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మూడు రోజులుగా సాగుతున్న దాడుల్లో పలు థియేటర్లను సీజ్ కూడా చేశారు. లైసెన్స్ లేకపోయినా, నిబంధనలు పాటించకపోయినా అధికారులు విరుచుకుపడుతున్నారు. దీంతో థియేటర్ల యాజమాన్యాలు, డిస్టిబ్యూటర్లతో పాటు హాళ్లకు వస్తున్న సాధారణ ప్రేక్షకులు కూడా దీనిపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ తనిఖీల వెనుక ఏముందనే చర్చ సాగుతోంది.

ఇన్నేళ్లుగా వదిలేసి
ప్రస్తుతం ఏపీలోని సినిమా థియేటర్లలో అధికారులు గుర్తిస్తున్న సమస్యలన్నీ గత కొంతకాలంగా ఉన్నవే. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మిన్నకుండిపోయారు. నిబంధనలు పాటించకపోయినా, అధిక రేట్లకు తినుబండారాలు అమ్ముతున్నా పట్టించుకోలేదు. చాలా సార్లు కోర్టులు జోక్యం చేసుకుని మరీ ఆదేళాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాని తర్వాత కూడా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉండిపోయాయి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో రెవెన్యూ, పోలీసులతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు కూడా థియేటర్లపై విరుచుకుపడుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.

జగన్, టాలీవుడ్ కు ఎక్కడ చెడింది ?
జగన్ అధికారంలోకి రాగానే టాలీవుడ్ పెద్దలు ఏడాది వరకూ ఆయన్ను వచ్చి పలకరించలేదు. మర్యాదపూర్వకంగా అయినా శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. దీనిపై అప్పట్లోనే పెద్ద రచ్చ జరిగింది. వైసీపీ నేతలు సైతం విమర్శలు చేసేవారు. ఆ తర్వాత చిరంజీవి నేతృత్వంలో టాలీవుడ్ పెద్దలు వచ్చి కరోనా సమయంలో సినిమా షూటింగ్ లకు అనుమతులు కోరారు. ఆ తర్వాత ఇండస్ట్రీ సమస్యలు కూడా ఆయన దృష్టికి తెచ్చారు. ఇందులో షూటింగ్ లకు అనుమతి మాత్రం వెంటనే ఇచ్చేసిన జగన్ మిగతా అంశాలపై మాత్రం స్పందించలేదు. దీంతో అంతా మర్చిపోయారని భావిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం సందర్భంగా వైసీపీ వర్సెస్ టాలీవుడ్ గా వ్యవహారం మారింది. హైకోర్టుకు వెళ్లి మరీ ఆదేశాలు తెచ్చుకున్న సినిమా నిర్మాతలు వైసీపీ సర్కార్ కు కంటగింపుగా మారారు. దీంతో ఆ తర్వాత ఆన్ లైన్ టికెట్ల వ్యవహారం సహా పలు అంశాల్లో ప్రభుత్వం కొరడా ఝళిపించడం మొదలుపెట్టింది.

టాలీవుడ్ పై జగన్ కోపం చల్లారలేదా ?
వకీల్ సాబ్ చిత్రం విడుదల సందర్భంగా తలెత్తిన అనుభవాల నేపథ్యంలో టాలీవుడ్ పై జగన్ కొరడా ఝళిపించడం మొదలుపెట్టారు. మా ఎన్నికల సందర్భంగా ఈ రచ్చ మరింత పెరిగింది. జగన్ పై పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నా టాలీవుడ్ నుంచి స్పందన కరవైంది. దీంతో జగన్ కోపం రెట్టింపైంది. ఆ తర్వాత నిబంధనల్నీ ఒక్కొక్కటిగా బయటికి తీయడం మొదలుపెట్టారు సామాన్యులకు సినిమాను చేరువ చేస్తామంటూ వైసీపీ సర్కార్ చట్టాల్లో మార్పులు చేయడం మొదలుపెట్టింది. తద్వారా టాలీవుడ్ కు చుక్కలు చూపిస్తోంది. దీంతో టాలీవుడ్ పెద్దలు కూడా మౌనంగా ఉండిపోతున్నారు. ఇవాళ హీరో నాని వ్యాఖ్యలు చేసినా మిగతా టాలీవుడ్ పెద్దల నుంచి స్పందన లేదు. దీంతో జగన్ కోపం కారణంగానే వారు మౌనంగా ఉండిపోతున్నట్లు అర్ధమవుతోంది.












Click it and Unblock the Notifications