అచ్చెన్నాయుడు రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది ? ఏసీబీ చెప్పిందేంటి ?
ఈఎస్ఐ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడుకి 14 రోజుల రిమాండ్ విధించింది.అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు వైద్యం అందించాలని కూడా కోర్టు ఆదేశించింది. టిడిపి హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోలు అక్రమాలకు సంబంధించి ఆయనపై వచ్చిన ఆరోపణలతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు నాడు మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఇచ్చిన సిఫార్సు లెటర్ ఆధారంగా అక్రమాలు జరిగాయని గుర్తించి అరెస్ట్ చేశారు. ఇక ఈ నేపథ్యంలో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
Recommended Video
ఆ ఒక్క లేఖతో అచ్చెన్నాయుడు అవినీతి బయటపడిందా ? అచ్చెన్న అవినీతి చిట్టా ఏసీబీ దగ్గర ఉందా ?
అచ్చెన్నాయుడు రిమాండ్ రిపోర్ట్ లో ఆసక్తికర విషయాలు
అచ్చెన్నాయుడు రిమాండ్ రిపోర్ట్ లో ఏసీబీ అధికారులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇక అచ్చెన్నాయుడు రిమాండ్ రిపోర్టులో అచ్చెన్నాయుడుపై సెక్షన్ 409, 420, 120బీ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొదటి నిందితుడిగా ఈఎస్ఐ డైరెక్టర్ రమేష్ కుమార్ పేరును ప్రస్తావించారు. ఇక రెండవ నిందితుడిగా అచ్చెన్నాయుడిని చేర్చారు. మూడవ నిందితుడిగా టెలీ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ ప్రమోద్ రెడ్డిని చేర్చారు.
ఒత్తిడితో కాంట్రాక్ట్ లు ఇప్పించారని పేర్కొన్న ఏసీబీ
అచ్చెన్నాయుడు రిమాండ్ రిపోర్ట్ చూసినట్లయితే టెలీ హెల్త్ సర్వీసులకు నిబంధనలు పాటించకుండా కాంట్రాక్ట్ ఇచ్చారని పేర్కొన్నారు. కనీసం బడ్జెట్ ఆమోదం కూడా పొందలేదని, ఆర్థిక శాఖ అనుమతులు ఏమాత్రం తీసుకోలేదని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ప్రభుత్వంతో ఎంఓయూ కూడా చేసుకోకుండా అనుభవం లేని సంస్థలకు కాంట్రాక్ట్ ఇచ్చారని పేర్కొన్నారు.టెండర్లు పిలవకపోవడానికి సరైన కారణాలు కూడా చూపించలేదని తెలిపారు.కాంట్రాక్టు ఇచ్చిన సంస్థకు గతంలో అనుభవం లేనప్పటికీ అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చి మరీ కాంట్రాక్టులు ఇప్పించారని పేర్కొన్నారు.
అచ్చెన్నాయుడు ఆదేశాలతో చేశామని డైరెక్టర్ రమేష్ కుమార్ వాంగ్మూలం
ఆదాయ పన్నుశాఖ,వాణిజ్య పన్నుల శాఖ సర్టిఫికెట్లు కూడా లేని టెలీ హెల్త్ సర్వీసులకు కాంట్రాక్టులు ఇప్పించడం చేశారని పేర్కొన్నారు. ఇక అంతేకాదు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకే 4.15 కోట్ల రూపాయలను విడుదల చేశామని డైరెక్టర్ రమేష్ కుమార్ చెప్పినట్లుగా ఏసీబీ అధికారులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇక ఈ కేసులో గతంలో మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడుతో పాటుగా చాలా మందిని విచారించాల్సి ఉందని, ఇంకా అనేక కీలక డాక్యుమెంట్లను, సాక్ష్యాలను సేకరించాల్సి ఉందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు ఏసీబీ అధికారులు. ఇక అచ్చెన్నాయుడుకి, రమేష్ కుమార్ కు జ్యుడీషియల్ కస్టడీ విధించాలని పేర్కొన్నారు.
జ్యుడిషియల్ కస్టడీ విధించాలని కోరిన ఏసీబీ అధికారులు
ఈ కేసులో మరింత మందిని విచారించాల్సిన నేపథ్యంలో విచారణకు ఎలాంటి ఆటంకం లేకుండా, సాక్ష్యాలను ప్రభావితం చేయకుండా అచ్చెన్నాయుడికి జ్యుడిషియల్ కస్టడీ విధించాలని ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఏపీ లో జరిగిన ఈఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడు అరెస్ట్ పై క్లారిటీ ఇచ్చిన ఏసీబీ అధికారులు అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నాయని స్పష్టంగా చెబుతున్నారు.
అన్ని ఆధారాలు ఉన్నాయని ఏసీబీ జేడీ వెల్లడి
ఇక నేడు ఈ వ్యవహారంలో మీడియా సమావేశం నిర్వహించిన ఏసీబీ జెడి రవికుమార్ ఇప్పటివరకు ఈఎస్ఐ స్కాం కు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని పేర్కొన్నారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశామని, అందుకే అచ్చెన్నాయుడుని విచారణకు పిలువలేదంటూ సమాధానమిచ్చారు. ఈ కేసులో ఇప్పటికే 19 మందిని దోషులుగా గుర్తించామని, మరి కొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. మొత్తం ఈఎస్ఐ కుంభకోణంలో 150 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని ఏసీబీ జె.డి వివరణ ఇచ్చారు.