'సర్వే'కు మూడురోజుల ముందు.. బాబును రాధాకృష్ణ కలిశారా?
సర్వే ఫలితాలు మీడియాలో వెలువడడానికి మూడు రోజుల ముందు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఏపీ సీఎం చంద్రబాబును కలిశారన్న గుసగుసలు టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
విజయవాడ: రాజకీయాలకు అనుకూల మీడియా ప్రోత్బలం పెరిగాక.. ఈమధ్య వెలువడుతున్న సర్వేలపై చాలామంది పెదవి విరుస్తున్న మాట నిజం. తాజాగా ఫ్లాష్ టీమ్ సర్వే అంటూ ఆంధ్రజ్యోతి వెలువరించిన సర్వే ఫలితాలపై కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సర్వే చేసింది ఆ పత్రిక అయినప్పుడు.. ఫలితాలు వేరుగా ఎలా ఊహించగలం? అని ప్రతిపక్ష నేతలు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సర్వే విషయాన్ని టీడీపీ శ్రేణులు సైతం అంత సీరియస్గా పరిగణించడం లేదన్న చర్చ ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ప్రయత్నించే ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రభుత్వ పనితీరుపై మొన్నామధ్య ఓ అంతర్గతసర్వే చేయించారన్న వార్త వినవచ్చిన సంగతి తెలిసిందే. దాని ప్రకారమే పార్టీ ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి సీల్డ్ కవర్ లను కూడా అందజేశారు.
ఆ సర్వే ప్రకారం.. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 56 నియోజవర్గాల్లోని ప్రజలు మాత్రమే టీడీపీ పనితీరు పట్ల సానుకూలత వ్యక్తం చేశారట. ఈ సర్వే జరిగి నెలలు గడవకముందే.. ఇప్పుడు ఆంధ్రజ్యోతి సర్వే తెరపైకి రావడం.. టీడీపీకి ఎదురులేదంటూ సర్వే ఫలితాలు వెల్లడించడం.. వాస్తవ విరుద్దంగా ఉందంటూ అభిప్రాయపడేవారు లేకపోలేదు.

కాగా, ఫ్లాష్ టీమ్ సర్వే ప్రకారం.. ఏపీలో ఉన్నపళంగా ఎన్నికలు జరిగితే టీడీపీ-బీజేపీ కూటమికి 120 సీట్లు, అదే టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే 140 సీట్లు దక్కుతాయని పేర్కొంది. అలాగే 2014 ఎన్నికలతో పోలిస్తే.. వైసీపీ కొన్ని స్థానాలు కోల్పోతుందని, ఇక జనసేన ప్రభావం అసలు ఉండబోదని తేల్చేసింది.
ఫ్లాష్ టీమ్ సర్వే వెనుక లోకేష్ హస్తం ఉండుంటుందా?
తాజాగా వెలువడ్డ ఫ్లాష్ టీమ్ సర్వే వెనుక లోకేష్ హస్తం ఉండవచ్చునన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. గతంలోను ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి, ప్రభుత్వ పథకాలకు సంబంధించి లోకేష్ అంతర్గత సర్వేలు చేయించారన్న ప్రచారమున్న నేపథ్యంలో.. తాజా సర్వే కూడా ఆయన పర్యవేక్షణలోనే జరిగి ఉండవచ్చునన్న వాదన బలంగా వినిపిస్తోంది.
పార్టీలో క్రియాశీలకంగా మారడానికి చాలానే శ్రమిస్తున్న లోకేష్.. పార్టీ స్థితిగతులను, జనంలో ప్రభుత్వ సమర్థతను ఎప్పటికప్పుడు అంచనా వేయాలనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి సర్వేలు చేయిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాని ప్రకారం ఆయన భవిష్యత్తు ప్రణాళికలు రచించే అవకాశముందని చెబుతున్నారు.
సర్వేకు మూడు రోజుల ముందు!
సర్వేకు సంబంధించి మరింత ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశమేంటంటే.. సర్వే ఫలితాలు మీడియాలో వెలువడడానికి మూడు రోజుల ముందు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఏపీ సీఎం చంద్రబాబును కలిశారన్న గుసగుసలు టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. విజయవాడలో చంద్రబాబును కలిసిన సందర్బంగా.. వీరిద్దరి మధ్య కచ్చితంగా సర్వే గురించిన చర్చ జరిగే ఉంటుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇందులో నిజానిజాలేంటో తెలియవు గానీ మొత్తానికి ఆంధ్రజ్యోతి ఫ్లాష్ టీమ్ సర్వేను తీవ్రంగా పరిగణించేవారు కొందరైతే.. అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదనేవారు మరికొందరు..!












Click it and Unblock the Notifications