అమరావతిలో ఇంటర్నేషనల్ లా స్కూల్-చంద్రబాబుతో బార్ కౌన్సిల్ చర్చలు..!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అమరావతి రాజధాని అభివృద్ధికి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇప్పటికే రాజధానిలో చెత్త కుప్పల తొలగింపు, వీధి దీపాల పునరుద్దరణతో పాటు ప్రారంభించి భారీ పెట్టుబడుల సేకరణ వరకూ అన్ని ప్రయత్నాలు చేస్తున్న కూటమి సర్కార్.. ఇప్పుడు మరో అంతర్జాతీయ విద్యా సంస్ధను ఇక్కడ ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ఇందుకోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా సహకారం అందించబోతోంది.
అమరావతి రాజధానిలో అంతర్జాతీయ లా స్కూల్ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారం తీసుకోనుంది. ఇప్పటికే అమరావతిలో ఇంటర్నేషనల్ లా స్కూల్ ఏర్పాటు కోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సన్నద్ధత వ్యక్తం చేసినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి కొనసాగింపుగా ఇవాళ మధ్యాహ్నం సీఎం చంద్రబాబుతో బార్ కౌన్సిల్ సభ్యులు భేటీ కాబోతున్నారు.

ఏపీ ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా అమరావతి రాజధానిలో ఏర్పాటు చేయబోయే ఇంటర్నేషనల్ లా స్కూల్ ద్వారా అంతర్జాతీయ స్దాయిలో న్యాయ నిపుణులను తయారు చేసే అవకాశం ఉంటుంది. ఇందుకు సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వంటి వారి సహకారం కూడా తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇవాళ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సీఎం చంద్రబాబు జరిపే చర్చల్లో కీలక నిర్ణయం వెలువడనుంది. ఈ స్కూల్ ఎప్పటికల్లా ఏర్పాటు అవుతుంది, ఇందులో ఎవరి భాగస్వామ్యం ఎంతన్న అంశాలు తేలబోతున్నాయి.












Click it and Unblock the Notifications