మీ రాజధానేదీ ? -చెప్తే అక్కడే పెట్టుబడి పెడతాం-జగన్ సర్కార్ పై ఇన్వెస్టర్ల ఒత్తిడి
ఏపీలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాం .... మీ రాజధానేదో చెబితే అక్కడ పెడతాం.. లేకపోతే కనీసం ప్రధాన పారిశ్రామిక హబ్ ఏదో చెబితే అక్కడైనా పెడతాం.. ఏదో ఒకటి చెప్పండి ప్లీజ్... ఇప్పుడు ప్రభుత్వానికి పెట్టుబడి దారుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి ఇది. మూడు రాజధానుల ప్రక్రియ మొదలు కాక ముందు అమరావతిలో పెట్టుబడులకు మొగ్గు చూపిన వారంతా ఇప్పటికే దుకాణం సర్దేసుకోగా.. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో తెలియక కొత్తగా వచ్చే వారు కూడా రావడం మానేస్తున్నారు. తాజాగా బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ చేసిన వ్యాఖ్యలు గమనిస్తే రాష్ట్రంలో ఏం జరుగుతుంతో ఇట్టే అర్ధమవుతుంది.
ఏపీ మూడు రాజధానులు
ఏపీలో అభివృద్ధిని నలు దిశలకు విస్తరించే లక్ష్యంతో వైసీపీ సర్కార్ చేపట్టిన మూడు రాజధానుల ప్రక్రియ సగంలోనే నిలిచిపోయింది. అసెంబ్లీ ఆమోదం తెలిపినా, గవర్నర్ సై అన్నా.. న్యాయవివాదాలు చుట్టుముట్టడంతో రాజధానుల వ్యవహారం హైకోర్టులో నలుగుతోంది. దీనిపై రెగ్యులర్ గా విచారణ కూడా జరగకపోవడంతో మూడు రాజధానుల వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఒక వేళ విచారణ తిరిగి ప్రారంభమైనా అది తేలడానికి చాలా సమయం పడుతుంది. హైకోర్టులో తేలిపోయినా పైన సుప్రీంకోర్టు ఉండనే ఉంది. అక్కడా క్లియరెన్స్ లభిస్తే తప్ప మూడు రాజధానులు అమల్లోకి వచ్చే అవకాశాలు లేవు. దీంతో అటు కేంద్రం కూడా హైకోర్టు తరలింపు సహా పలు కీలక విషయాలపై మౌనంగా ఉండిపోతోంది.
మొహం చాటేస్తున్న పరిశ్రమలు
ఏపీలో గతంలో రాజధానిగా అమరావతి ఉండగా.. అక్కడ పెట్టుబడి పెట్టేందుకు భారీగా పరిశ్రమలు వచ్చాయి. వీటిలో కొందరికి అప్పటి టీడీపీ సర్కార్ అనుమతి ఇవ్వగా. మరికొన్ని అనుమతుల కోసం వేచి చూశాయి. కానీ మూడు రాజధానుల ప్రక్రియ ఎప్పుడైతే ప్రారంభమైందో అక్కడికి కూడా పరిశ్రమలు రావడం మానేశాయి. అలాగని కొత్తగా ఏర్పాటవుతున్న విశాఖ లేదా కర్నూలు రాజధానులకైనా పరిశ్రమలు వెళ్తున్నాయా అంటే అదీ లేదు. ప్రభుత్వం చెప్పుకోవడానికి సైతం పరిశ్రమలు కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వం కూడా పరిశ్రమల ఊసెత్తాలంటేనే భయపడుతోంది.
వచ్చిన పరిశ్రమలూ వెనక్కి
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో అమరావతితో పాటు వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్ధలు క్యూ కట్టాయి. ఇందులో లులూ గ్రూప్, రిలయన్స్, ఆదానీ గ్రూప్ వంటి సంస్ధలు ఉన్నాయి. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాలతో అమరావతి నుంచి సంస్ధలు వెనక్కి వెళ్లిపోయాయి. ఆ తర్వాత
విశాఖ నుంచి లూలూ గ్రూప్ వెళ్లిపోయింది. ఆ తర్వాత అదానీ మెగా డేటా హబ్ కూడా మాయమైంది. చివరికి చిత్తూరు జిల్లాలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలనుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా తరలివెళ్లిపోయింది. ఇప్పుడు కాలుష్యం పేరుతో అమరరాజా బ్యాటరీస్ సంస్ధను కూడా ప్రభుత్వం తరిమేస్తోంది. దీంతో వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లే వచ్చి మాయమైపోతున్నాయి. అలాగని కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తున్న పారిశ్రామిక దిగ్గజాలు కూడా ముందుకు రావడం లేదు. గతంలో స్టీల్ ప్లాంట్ కు సహకరించేందుకు వచ్చిన సంస్ధ దివాళా తీసి తమ నిర్ణయం వెనక్కి తీసుకోగా... తాజాగా పెట్టుబడిదారుగా ఎంపికైన ఎస్సార్ గ్రూప్ కూడా ముందడుగు వేయడం లేదు.
పెట్టుబడిదారుల్లో డైలమా
మూడు రాజధానుల వ్యవహారం తెరపైకి వచ్చింది కానీ ఎటూ తేలడం లేదు. దీంతో ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు వచ్చే వారు తాము ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియని గందరగోళంలోకి వెళ్లిపోతున్నారు. రాజధానిగా అమరావతి ఉంటుందా లేక విశాఖకు వెళ్తుందా లేక కర్నూల్లో ఏర్పాటవుతుందా తెలియక పెట్టుబడిదారులు గందరగోళానికి గురవుతున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వం మూడు రాజధానులని చెప్తున్నా ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుబడులు పెట్టే పరిస్ధితి లేదు. రేపు హైకోర్టు అమరావతినే రాజధానిగా ప్రకటిస్తే తమ పరిస్ధితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో రాజధానుల వ్యవహారం తేలే వరకూ ఆగాల్సిందేనని వారు భావిస్తున్నారు. ఇప్పటికే మూడు రాజధానుల ఏర్పాటు కారణంగా ఈ మూడు ప్రాంతాల్లో ఏ ఒక్క దానికీ లబ్ది చేకూరని పరిస్ధితులు ఉన్నాయి. కేవలం విశాఖకు మాత్రమే కాస్తో కూస్తో మొగ్గు కనిపిస్తోంది. అయినా అదీ శాశ్వతం కాకపోవచ్చనే చర్చ జరుగుతోంది. దీంతో పెట్టుబడి దారులు ప్రభుత్వం క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు.
క్లారిటీ కోరిన బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్
మూడు రాజధానుల్లో న్యాయ రాజధాని అయిన కర్నూలును మినహాయిస్తే మిగతా రాజధానులైన విశాఖ, అమరావతిలో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని పెట్టుబడిదారులు కోరుతున్నారు. విశాఖ, విజయవాడల్లో ఏది ప్రధాన హబ్బో చెబితే అక్కడ పెట్టుబడులు పెడతామని తాజాగా బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అయితే ప్రభుత్వం వద్ద దీనికి సమాధానం లేదు. కొత్త రాజధాని అయిన విశాఖలో పెట్టుబడులు పెట్టమని సూచిస్తే రేపు తేడా వస్తే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అలాగని విజయవాడలో పరిశ్రమలు పెట్టించి తీరా ప్రభుత్వం విశాఖకు తరలిపోతే అప్పుడు పెట్టుబడిదారులు నష్టపోవాల్సి వస్తుంది. అదీ ఇబ్బందే. దీంతో ప్రభుత్వం ఎటూ చెప్పలేక మల్లగుల్లాలు పడుతోంది.
Recommended Video
రాజధాని తేలాకే క్లారిటీ అంటున్న సర్కార్
ప్రస్తుతం రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారంతా ప్రభుత్వం నుంచి వచ్చే సంకేతాల కోసం ఎదురుచూస్తున్నారు. మూడు రాజధానుల వ్యవహారం అంతిమంగా పరిష్కారమయ్యేది కోర్టుల్లోనే అయినా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కీలకం కాబట్టి పెట్టుబడిదారులు క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వారికి అవునని కానీ కాదని కాని చెప్పలేని పరిస్ధితి. దీంతో ఈ డైలమా రెండేళ్లుగా కొనసాగుతోంది. మరికొన్నాళ్లు ఇదే పరిస్ధితి తప్పేలా లేదు. రాజధాని వ్యవహారం పరిష్కారం అయితే తప్ప పెట్టుబడిదారులకు ఏమీ చెప్పలేమని ప్రభుత్వం చెబుతోంది. న్యాయ వివాదాల నుంచి బయట పడటంపైనే ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. వచ్చే పరిశ్రమలు వెళ్లిపోతూ, కొత్త పరిశ్రమలూ రాకపోతే పారిశ్రామికాభివృద్ధి ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రయత్నించకపోవడం వల్లే ఈ పరిస్ధితి ఎధురవుతోందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఐదేళ్లలో కొత్త పరిశ్రమలు రాకపోతే భవిష్యత్తులో దీని ప్రభావం వాణిజ్య, పారిశ్రామిక, ఆర్ధిక రంగాలపై పడటం ఖాయంగా కనిపిస్తోంది.