వీళ్లు వెనక్కి వస్తే తీసుకుంటాం...వాళ్లు రావాలంటే..?: వైసిపి ఎంపి విజయసాయి
వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లిన తమ పార్టీ ఎమ్మెల్యేలు మళ్లీ వెనక్కి వస్తే తీసుకుంటామని వైసిపి పార్టీ రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు. హైదరాబాద్లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. టీడీపీలోకి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు.
వాళ్లు తమ ఎమ్మెల్యేలే గనుక మళ్లీ తప్పు తెలుసుకొని వెనక్కి వస్తే తీసుకుంటామన్నారు. అలాగే అధికార పార్టీ టిడిపిలో కూడా చాలా మంది ఎమ్మల్యేలు అసంతృప్తితో,ఆందోళనతో ఉన్నారని విజయ్ సాయి రెడ్డి చెప్పారు. వాళ్లలో చాలా మందికి తిరిగి గెలుస్తామనే నమ్మకం సన్నగిల్లుతోందని, అలాంటి వారందరూ వైసిపి వైపు చూస్తున్నారని చెప్పుకొచ్చారు.
అయితే వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి నైతిక విలువలు ఉన్నాయని...అందుకే టీడీపీ శాసనసభ్యులను నేరుగా తమ పార్టీ వైసీపీలోకి తీసుకోబోమని చెప్పారు. వారు తమ పదవులకు,పార్టీకి రాజీనామా చేసి వస్తే అప్పుడు తమ పార్టీలోకి వారిని తీసుకుంటామన్నారు. కోడుమూరు ఎమ్మెల్యే మణి గాంధీ టిడిపిలో తన పరిస్థితి గురించి బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు బద్వేలు ఎమ్మెల్యే జయరాములు పరిస్థితి కూడా అదేనని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.