సాయిరెడ్డి పై పరువునష్టం కేసు వేస్తా: నిఘా మాజీ బాస్ ఏబి వెంకటేశ్వర రావు ..!
వైసిపి ఎంపి విజయ సాయి రెడ్డి పై సీనియర్ ఐపియస్ అధికారి...కొద్ది రోజుల క్రితం వరకు ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబి వెంకటేశ్వర రావు పరువు నష్టం దావా వేసేందుకు సిద్దమవుతున్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఏబి వెంకటేశ్వర రావు పై వైసిపి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసింది. ఫలితంగా ఆయన్ను ఎన్నికల విధుల నుండి తప్పిస్తూ ఎన్నికల సంఘం ఆదేశించింది. తాజాగా ఏబి వెంకటేశ్వర రావు పై సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల వ్యవహారం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది.
సాయిరెడ్డి వర్సెస్ ఏబి వెంకటేశ్వర రావు
టిడిపి ప్రభుత్వం లో ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబి వెంకటేశ్వర రావు పై చాలా కాలంగా వైసిపి దృష్టి సారించింది. అందునా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలోనూ ఏబి వెంకటేశ్వర రావు పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. నంద్యాల ఎన్నికల సమమం నుండి తాజా ఎన్నికల వరకూ ఏబి వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబు కు మద్దతుగా పార్టీ నేతగా పని చేస్తున్నారనేది వైసిపి నేతల ఆరోపణ. ఇక, తాజా ఎన్నికల సమయంలో టిడిపి కోసం ఇంటలిజెన్స్ చీఫ్ అనైతికంగా వ్యవహరిస్తున్నారంటూ వైసిపి నేతలు నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. దీంతో..ఇంటలిజెన్స్ చీఫ్ ను ఎన్నికల విధుల నుండి తప్పిస్తూ ఎన్నికల సంఘం ఆదేశించింది. దీనిని నిరసిస్తూ ఏపి ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు సైతం ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేయటంతో ప్రభుత్వం ఆయన్ను రిలీవ్ చేసింది.
ఇసి ముందు ఏబి పై కీలక వ్యాఖ్యలు
తాజాగా, రాజ్యసభ ఎంపి విజయ సాయిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన సందర్భంతో కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల రోజున అదే విధంగా ఆ తరువాత టిడిపి శ్రేణులు వైసిపి నేతల పై దాడులకు దిగుతున్నారని వైసిపి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. అదే సమయంలో స్ట్రాంగ్ రూమ్లకు కేంద్ర బలగాలను రక్షణగా ఏర్పాటు చేయాలని కోరారు. ఇదే సందర్భంలో విజయ సాయిరెడ్డి ఏపి డిజిపి ఠాకూర్ తో పాటుగా ఏబి వెంకటేశ్వర రావు పైన కొన్ని వ్యాఖ్యలు చేసారు. దీని పై ఏబి వెంకటేశ్వర రావు స్పందించారు. ఎన్నికల ముందు నుండి వైసిపి నేతలు నేరుగా డిజిపి ఠాకూర్ అదే విధంగా ఏబి వెంకటేశ్వర రావు ఏం చేస్తున్నారనే దాని పై సమాచారం సేకరిస్తున్నారు. దీనికి అనుగుణంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసారు. ఇక, వైసిపి ఫిర్యాదు ఆధారంగా ఇంటలిజెన్స్ చీఫ్ను ఎన్నికల విధుల నుండి తప్పించటం పై ముఖ్యమంత్రి సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు.
సాయిరెడ్డి పై పరువునష్టం దావా..
ఎన్నికల సంఘాన్ని కలిసిన తరువాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేసుల వరకు వెళ్లాయి. ఆధార్ సంస్థ చేసిన ఫిర్యాదు పై స్పందనగా మాట్లాడిన విజయ సాయిరెడ్డి ఏపిలో ఇప్రగతి ప్రాజెక్టు పేరుతో ఆధార్ సమాచారం మొత్తం సేకరించారని.. ఆ ప్రాజెక్టు కాంట్రాక్టు డిజిపి ఠాకూర్ తో పాటుగా ఇంటలిజెన్స్ చీఫ్గా వ్యవహరించిన ఏబి వెంకటేశ్వరరావు సంబంధీకులు దక్కించుకున్నారని చెప్పుకొచ్చిన విజయ సాయిరెడ్డి సరైన సమయంలో వివరాలను బయట పెడతానని చెప్పారు. దీని పై స్పందించిన ఏబి వెంకటేశ్వర రావు తమకు ప్రభుత్వం లో ఎటువంటి కాంట్రాక్టులు..ఒప్పందాలు లేవని స్పష్టం చేసారు. తన పై హేయమైన వ్యాఖ్యలు చేసిన విజయ సాయిరెడ్డి పై పరువు నష్టం దావా వేయనున్నట్లు స్పష్టం చేసారు.