బడ్జెట్ ఎఫెక్ట్: శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేతో బాబు ఫోన్లో చర్చలు, ఏపీలో మారుతున్న రాజకీయాలు
అమరావతి: బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై అసంతృప్తిగా ఉన్న టిడిపి నేతలు బిజెపితో మిత్రత్వం విషయంలో తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్నారు. ఇటీవలనే బిజెపితో మైత్రిని తెగతెంపులు చేసుకొన్న శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రేతో టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు ఫోన్లో మాట్లాడారు. ఈ పరిణామాలు చూస్తే రాజకీయంగా సమీకరణాలు మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
2014 ఎన్నికల సమయంలో బిజెపి, టిడిపి మిత్రపక్షాలుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ చేశాయి.కేంద్ర ప్రభుత్వంలో టిడిపి కూడ చేరింది. కానీ, ఏపీ రాష్ట్రానికి ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను బిజెపి నెరవేర్చలేదనే అభిప్రాయాలను టిడిపి నేతలు వ్యక్తం చేస్తున్నారు.
బడ్జెట్ కేటాయింపుల విషయమై ఏపీకి తీవ్రమైన అన్యాయం జరిగిందని టిడిపి నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. బిజెపితో పొత్తు విషయమై రాజకీయ నిర్ణయం తీసుకొందామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రెండు రోజుల క్రితం జరిగిన కేబినేట్ సమావేశంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

శివసేన నేత ఉద్దవ్ ఠాక్రేకు బాబు ఫోన్
శివసేన నేత ఉద్దవ్ ఠాక్రేకు ఏపీ సీఏం చంద్రబాబునాయుడు ఫోన్ చేయడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హట్ టాపిక్ గా మారింది. బిజెపి తీరు పట్ల అసంతృప్తిగా ఉన్న చంద్రబాబునాయుడు శివసేన నేత ఠాక్రేతో ఫోన్ లో మాట్లాడడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఇటీవలనే బిజెపితో మైత్రిని శివసేన తెగతెంపులు చేసుకొంది. 20 ఏళ్ళ స్నేహనికి శివసేన గుడ్బై చెప్పింది. బిజెపి అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా శివసేన బహిరంంగానే విమర్శలు ఎక్కుపెడుతోంది. ఈ సమయంలోనే బిజెపితో మిత్రపక్షంగా ఉన్న టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు ఉద్దవ్ ఠాక్రేకు ఫోన్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

బిజెపి తీరును ఎండగడుతున్న టిడిపి నేతలు
ఏపీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హమీలను నెరవేర్చలేదనే అభిప్రాయాన్ని టిడిపికి చెందిన ప్రజాప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు.ఈ తరుణంలో బిజెపితో తాడోపేడో తేల్చుకోవాలని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొందరు ప్రజాప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు బిజెపితో తెగతెంపులు తప్పకపోవచ్చనే సంకేతాలను వ్యక్తం చేస్తున్నారు 2019 ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకొంటే రాజకీయంగా తీవ్రంగా నష్టపోయే అవకాశం లేకపోలేదని టిడిపి నేతలు అభిప్రాయంతో ఉన్నారు.ఈ విషయాలపై బాబు ఉద్దవ్ ఠాక్రేతో చర్చించారని సమాచారం. మరో వైపు చంద్రబాబునాయుడు కాంగ్రెస్, బిజెపియేతర కూటమిని ఏర్పాటు చేసి గతంలో కీలకంగా వ్యవహరించారు. ఈ తరుణంలో ఉద్దవ్ ఠాక్రేతో చర్చలు మూడో కూటమి ఏర్పాటుకు దారితీస్తాయా అనే అభిప్రాయాలను కూడ రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

బిజెపి తీరుపై టిడిపి నేతల్లో అసంతృప్తి
2014 ఎన్నికల సమయంలో బిజెపి, టిడిపి సంయుక్తంగా నిర్వహించిన ఎన్నికల సభల్లో ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనున్నట్టు మోడీ హమీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదాను మాత్రం ఇవ్వలేదు. కానీ, హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని మాత్రం కట్టబెట్టారు. ప్రత్యేక ప్యాకేజీలో కూడ ఏపీకి ఇవ్వాల్సిన నిధులను ఇవ్వలేదని టిడిపి నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి మొండి చేయి చూపడం వంటి పరిణామాలు టిడిపి నేతల్లో అసంతృప్తిని కల్గిస్తున్నాయి. దీనికి తోడు ఏపీకి చెందిన బిజెపి టిడిపి నేతలపై, ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండడం వంటి పరిణామాలతో టిడిపి నేతలు బిజెపితో తెగతెంపులు చేసుకోవాలన్న అభిప్రాయంతో ఉన్నారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై పార్టీ నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.

మూడో కూటమి తెరపైకి వస్తోందా
కాంగ్రెస్, బిజెపియేతర పార్టీలతో మూడో కూటమి మరోసారి తెరపైకి వచ్చే అవకాశాలున్నాయా అనే విషయమై ప్రస్తుతం ఆసక్తిగా మారింది. బిజెపితో మిత్రపక్షంగా ఉన్న టిడిపి మూడో ఫ్రంట్ ఏర్పాటుకు అంకురార్పణ చేయనుందా అనే చర్చ కూడ లేకపోలేదు. శివసేన నేత ఉద్దవ్ ఠాక్రేతో బాబు చర్చలు జరపడం ప్రస్తుతం ఈ అనుమానాలకు తావిస్తోంది పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడ ఉద్దవ్ ఠాక్రేతో చర్చిస్తున్నారు. అయితే గతంలో మూడో ఫ్రంట్ ఆధ్వర్యంలో చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. బిజెపి తీరుతో అసంతృప్తిగా ఉన్న బాబు మూడో కూటమిపై అంకురార్పణ చేస్తారా లేదా అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.












Click it and Unblock the Notifications