పవన్ కల్యాణ్పై పదేపదే..: చిరంజీవి అలసిపోయారా?
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అభిమానుల ప్రశ్నలతో అలసిపోయారా? అంటే కావొచ్చునననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రతి 'మెగా' ఈవెంట్లో జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి అభిమానులు అడుగుతుండటంతో ఆయన విసిగిపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
మెగా కుటుంబానికి చెందిన ఏ హీరో ఆడియో ఫంక్షన్ జరిగినా అభిమానులు పవన్ కల్యాణ్ను కలవరిస్తుంటారు. అంతేకాదు, ఆయన గురించి పదేపదే అడుగుతుంటారు. పవన్ రాకపోవడం.. దాని పైన మెగా హీరోలు వేదిక పైనుండి వివరణ ఇవ్వడం జరుగుతోంది.
గతంలో చిరంజీవి కూడా పలుమార్లు అభిమానులకు వివరణ ఇచ్చారు. షూటింగులో ఉన్నారని, మరో ప్రోగ్రాంలో ఉన్నారని చెప్పేవారు. అయితే, రెండు రోజుల క్రితం నాగబాబు తనయుడు వరుణ్ తేజ హీరోగా నటించిన ముకుంద ఆడియో ఫంక్షన్లో మాత్రం చిరంజీవి కొంత అలసిపోయి వివరణ ఇచ్చినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
ముకుంద ఆడియో ఫంక్షన్ సమయంలో అభిమానులు పవన్ గురించి అడగటంతో.. పవన్ షూటింగ్లో ఉన్నారని ఇంతకుముందే చెప్పారని గుర్తు చేశారు. దూరంలో ఉన్నాడని, వర్క్ పట్ల కమిట్మెంట్ అన్న చిరంజీవి, లీవిట్ అంటూ ముగించారు. వదిలేయండి అనడం ద్వారా చిరంజీవి పదేపదే అభిమానుల నుండి ఆ ప్రశ్న రావడంతో అలసిపోయారని అర్థమవుతోందని అంటున్నారు.
కాగా, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు 2009లో పవన్ కల్యాణ్ జోరుగా ప్రచారం చేశారు. అయితే, ఆ తర్వాత పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. అనంతరం 2014 సాధారణ ఎన్నికలకు ముందు పవన్ జనసేన పార్టీని స్థాపించి బీజేపీ - టీడీపీ పక్షాలకు మద్దతుగా ప్రచారం చేశారు.