అసెంబ్లీలో జగన్ తీరు: జనాలకి ఫోన్ చేసి అడిగారా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఎలా ఉంది, పార్టీకీ చెందిన ఎమ్మెల్యేల ప్రసంగం ఎలా ఉందని ఆ పార్టీకి చెందిన పలువురు అభిమానులు సామాన్య ప్రజలకు ఫోన్ చేసి అడిగారని వార్తలు వస్తున్నాయి.
పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభిమానులు సభలో జగన్ పర్ఫార్మెన్స్, ఎమ్మెల్యేల ప్రసంగం తీరును సామాన్య ప్రజల ముందు ఉంచి అడిగారని అంటున్నారు. ఫోన్ ద్వారా అసెంబ్లీలో వారి తీరు పైన సామాన్యుల నుండి అభిప్రాయం సేకరించారని అంటున్నారు.
13 జిల్లాలలోని సామాన్యులకు ఫోన్ చేసి దీని గురించి అడిగారని తెలుస్తోంది. ఓ రాజకీయ పార్టీ సామాన్యులకు ఫోన్ చేసి ఇలా అభిప్రాయాలు సేకరించడం ఆశ్చర్యం కలిగిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ఫోన్ ద్వారా అభిప్రాయ సేకరణ చేపట్టాలన్న ప్రచారాన్ని ఆ పార్టీ కొట్టి పారేస్తోందని కూడా తెలుస్తోంది. అయితే, పార్టీ అభిమానులు కొందరు అలా అడిగి ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి.