చిరంజీవి దారిలో.. పవన్ కళ్యాణ్: మతలబు ఏమిటి, రాజకీయంగా పెను మార్పులా?
ఏలూరు: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును ఏలూరుకు మార్చుకోవాలనే నిర్ణయంపై ఇంకా చర్చ సాగుతోంది. దీని వెనుక ఏం రాజకీయ మతలబు ఉందనే చర్చ ఆ వర్గాల్లో కొనసాగుతోంది.
ఏలూరులో ఓటరుగా తన పేరు నమోదు చేయించుకోవాలని పవన నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అక్కడే ఓ మంచి ఇంటిని చూడమని కూడా చెప్పారు.
ఈ నేపథ్యంలో ఆయన నిర్ణయంపై జోరుగా చర్చ సాగుతోంది. సొంత గడ్డ అని ఏలూరులో ఓటరు పేరు నమోదు చేయించుకుంటున్నారా? తన సామాజిక వర్గం అధికంగా ఉండటంతో ఇక్కడకు మకాం మార్చుతున్నారా? అనే చర్చ సాగుతోంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో సహజంగానే కాపుల ఓటు బ్యాంకు అధికం. అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ను కాపు కులస్తులు తమ రాజకీయ భవిష్యత్తుగా ప్రచారం చేసుకుంటున్నారని చెబుతున్నారు.
కేవలం ఒక సామాజిక వర్గం నాయకుడిగా మిగిలితే, ఆ సామాజిక వర్గం ఉత్సాహం ప్రదర్శిస్తే 2009లో చిరంజీవికి, ఆయన పార్టీ ప్రజారాజ్యంకు పట్టిన గతే పడుతుందని అంటున్నారు. ఆ ఎన్నికల్లో పాలకొల్లు నుంచి పోటీ చేసిన చిరంజీవి పరాజయం పాలయ్యారు. ఈ అంశం ఇప్పుడు చర్చకు వస్తోంది.
అయితే, పవన్ మాత్రం అందుకు భిన్నంగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. సాధారణంగా ఆయన కుల, మతాలకు దూరంగా ఉంటారు. తాను ఏ కులానికి ప్రతినిధిని కాదని, సమన్యాయానికి కట్టుబడి ఉంటానని చెబుతుంటారు.
అయితే, తన సొంత ఇలాకా కాబట్టి పవన్ కళ్యాణ్ ఏలూరును ఎంచుకున్నారని చెబుతున్నారు. భవిష్యత్తులో అక్కడి నుంచే పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. అదే జరిగితే జిల్లాలో, తద్వారా రాష్ట్రంలో రాజకీయంగా పెను మార్పులు ఖాయమంటున్నారు.
పవన్ కళ్యాణ్ జనసేన అధినేత హోదాలో పగో జిల్లాలో పర్యటించలేదు. గతంలో రెండుసార్లు పశ్చిమ గోదావరిలో తిరిగారు. 2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం అనుబంధ సంస్థ యువరాజ్యం అధ్యక్షుని హోదాలో ఏలూరులో, 2014 ఎన్నికల్లో జనసేన సంస్త అధిపతిగా తణుకులో పర్యటించారు.
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును ఏలూరుకు మార్చుకోవాలనే నిర్ణయంపై ఇంకా చర్చ సాగుతోంది. దీని వెనుక ఏం రాజకీయ మతలబు ఉందనే చర్చ ఆ వర్గాల్లో కొనసాగుతోంది.