రివర్స్, టిడిపిలో ఆందోళన: చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ చెక్, జగన్ సేఫ్!
ఏలూరు: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏకంగా తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు షాకిచ్చేలా ఉందా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఊరట కలిగించేదేనా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
పవన్ ఏలూరులో ఓటు హక్కు తీసుకోనున్నారు. ఇంటిని కూడా వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఇక్కడకు వస్తే రాజకీయ లెక్కలు ఏమిటనే విషయమై జోరుగా చర్చ సాగుతోంది.

కాపు ఓట్ల పైన దృష్టి
పవన్ కళ్యాణ్ ప్రధానంగా కాపు ఓట్ల పైన దృష్టి సారించారనే వాదనలు వినిపిస్తున్నాయి. కులం గురించి పవన్కు పెద్దగా పట్టింపులు ఉండవు. ఆయన కుల రాజకీయాలు చేసేందుకు ఆసక్తి చూపించరు. అయితే, ఆయన తాజా నిర్ణయం ద్వారా కాపులు బలంగా ఉన్న గోదావరి జిల్లాల్లో జనసేన బలోపేతం కావడం ఖాయమని భావిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపికి అండగా నిలిచిన కాపులు ఈసారి జనసేన వైపు మరలుతారని చెబుతున్నారు.
టిడిపికి అన్ని స్థానాలు వచ్చాయి కానీ
గత సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో టిడిపి అన్ని స్థానాలను గెలుచుకుంది. దీని పైన పవన్ దృష్టి పెట్టడం ప్రధానంగా చర్చకు దారి తీసింది. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగితే జిల్లాలోని అన్ని సీట్ల పైన పవన్ ప్రభావం పడి, అది తమకు నష్టం చేస్తుందని టిడిపి నేతల్లో అప్పుడే ఆందోళన ప్రారంభమైందని అంటున్నారు.
2014 ఎన్నికలకు ముందే పవన్ పార్టీ స్థాపించారు. కానీ ఆయన పోటీ చేయలేదు. టిడిపి - బిజెపి కూటమికి మద్దతిచ్చారు. ఆయన మద్దతు వల్ల తుగో, పగో జిల్లాల్లో టిడిపి దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. ప.గో జిల్లాలో అయితే మొత్తం సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు పవన్ తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications