హోదాపై మైండ్ బ్లాంక్! కేంద్రం ప్లాన్గా..: ఆ తర్వాతే ప్యాకేజీ ప్రకటన, కేవీపీ ఒక్కటి చేసినా
అమరావతి: ప్రత్యేక హోదా అంశం ఏపీలో రాజకీయ వేడిని రాజేస్తోంది. హోదా ఇవ్వమని, దానికి సమానమైన ప్యాకేజీ ఇస్తామని బీజేపీ చెబుతోంది. ఆ ప్యాకేజీని టిడిపి స్వాగతించింది. దీనిపై విపక్షాలైన వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు మండిపడుతున్నాయి.
ప్రత్యేక హోదా ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన సమస్య అని విపక్షాలు చెబుతున్నాయి. హోదా వస్తేనే ఉద్యోగం, నిధులు, పరిశ్రమలు వస్తాయని చెబుతున్నారు. కేంద్రం మాత్రం హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని చెప్పింది. ఈ ప్రకటనకు ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర కసరత్తు చేశాయి.
అందులో భాగంగా, కేంద్ర, రాష్ట్ర నిఘావిభాగాలు ఇటీవల ఓ సర్వే నిర్వహించాయని తెలుస్తోంది. అందులో షాకింగ్ అంశాలు వెలుగు చూసాయట. కేంద్రప్రభుత్వం ప్యాకేజీ ప్రకటనకు ముందు చాలా కసరత్తే చేసిందని అంటున్నారు. ఏపీలో హోదా అనేది ప్రజలకు సెంటిమెంట్గా మారిందనీ, భావోద్వేగాలతో ముడిపడిపోయిందనీ కేంద్రానికి అన్ని పక్షాల నేతలు చెప్పారు.
రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రవేశపెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లు ఏపీలోని అన్ని పార్టీలని ఏకం చేసిందని చెప్పవచ్చు. ఈ అంశాన్ని గమనించిన బీజేపీ ఢిల్లీ నేతలు.. ఏపీలో హోదా ఆకాంక్ష ఎలా ఉందో, క్షేత్రస్థాయిలో ప్రజలనాడి ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించారని అంటున్నారు. ఇందుకు నిఘా విభాగం రంగంలోకి దిగింది.
పలు చోట్ల సర్వే నిర్వహించారని తెలుస్తోంది. ఇందులో షాకింగ్ విషయం వెల్లడయిందట. ఎక్కువమంది.. తమకు ప్రత్యేకహోదా అంటే ఏమిటో తమకు తెలియదని, కష్టాల్లో ఉన్న ఏపీకి డబ్బులు ఇచ్చి ఆదుకుంటే చాలునని చెప్పారని తెలుస్తోంది. మరికొంతమంది ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం గట్టెక్కాలంటే నిధులు రావాలని కోరుకున్నారు.
ఇరవై నుంచి ఇరవై అయిదు శాతం మంది వరకు హోదా వస్తే పరిశ్రమలు వస్తాయనీ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనీ, ఆర్ధికంగా కూడా బాగుపడతామని నేతలు చెబుతున్న మాటలను నమ్ముతున్నామనీ, అందుకే హోదా అడుగుతున్నామని చెప్పారని తెలుస్తోంది.
దాదాపుగా అరవై నుంచి అరవై అయిదు శాతంమంది మాత్రం ఏ రూపంలోనైనా సాయం అందితే చాలని కోరుకున్నారని సమాచారం. ఈ సమాచారాన్ని క్రోఢీకరించిన తర్వాతనే కేంద్రం ప్యాకేజీ వైపు మొగ్గు చూపిందని అంటున్నారు. అలాగే, ప్యాకేజీ పైన కేంద్రమంత్రి వెంకయ్య సాయం పైన కొంతమంది సంతృప్తి చెందగా, ఆయనే హోదా కావాలని పట్టుబట్టారు కాబట్టి అడుగుతున్నామని మరికొందరు చెప్పారు. అయితే, హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తే ఫర్వాలేదని మరికొందరు చెప్పారు.