ఇది ఏపీపై జగన్ పన్నిన కుట్ర.. అవినీతి ఆధారాలుంటే బయటపెట్టు..!
విజయవాడ: ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. ఓ వైపు ఫిరాయింపులు, మరోవైపు జగన్ ఢిల్లీ రాజకీయంతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. ఇరు పార్గీల నాయకులు విమర్శలు ప్రతి విమర్శలతో ఎదురుదాడికి దిగుతున్నారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ పై ఫైర్ అయ్యారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా.
"ఎంపరర్ ఆఫ్ కరప్షన్" పేరిట ఏపీ సీఎం చంద్రబాబు అవినీతిపై ముద్రించిన పుస్తకాన్ని జగన్ జాతీయ స్థాయి నేతలందరికి అందజేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బోండా ఉమా.. చంద్రబాబు లక్ష కోట్ల అవినీతి చేసినట్టుగా జగన్ ఆధారాలు చూపించగలరా..? అని నిలదీశారు. ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేసిన బోండా ఉమా, జగన్ ఏపీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.
ఏపీకి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడానికే జగన్ ఢిల్లీలో ఏపీపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బోండా ఉమా. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి ముందు నిలబడలేకే జగన్ ఇలా ఏపీపై కుట్ర పన్నుతున్నారని మండిపడ్దారు.