సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ గైర్హాజరు... రీజన్ చెప్పిన న్యాయవాది
ఏపి సిఎం జగన్ మోహన్ రెడ్డి నేడు సీబీఐ కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆయన హాజరు కాలేదు. జగన్ అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని సి.బి.ఐ ప్రత్యేక న్యాయస్థానానికి హాజరు కావాలి .ఇక ఈ కేసు విషయంలో తనకు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వమని కోరినా కోర్టు జగన్ అభ్యర్థనను తోసిపుచ్చింది. కచ్చితంగా హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ నేడు కోర్టుకు హాజరు కావలసిన సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టులో విచారణకు హాజరుకాలేదు.
జగన్ అక్రమాస్తుల కేసులో నేడు సీబీఐ కోర్టులో విచారణ జరిగింది . ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసును ఈరోజు నాంపల్లి సీబీఐ కోర్టు విచారించింది. మొత్తం 11 ఛార్జిషీట్లకు సంబంధించి విచారణ చేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం .ఇక ఈ రోజు విచారణకు ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ హాజరయ్యారు. జగన్ మాత్రం కోర్టు కచ్చితంగా హాజరు కావాలని ఆదేశించినా గత శుక్రవారం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటన ఉన్న నేపథ్యంలో మినహాయింపు కోరడంతో ఆయన చేసుకున్న అభ్యర్థనను సీబీఐ న్యాయస్థానం అంగీకరించింది .
ఇక నేడు అధికారిక పర్యటనల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో జగన్ విచారణకు హాజరు కాలేరంటూ ఆయన తరుపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఇదే ఆయన హాజరు కాని కారణంగా తెలుస్తుంది. ఇక జగన్ తో పాటు విజయసాయిరెడ్డి సహా ఇతర నిందితులెవరూ ఈనాటి విచారణకు హాజరుకాలేదు. వ్యక్తిగత హాజరు నుంచి జగన్ కు మినహాయింపును ఇవ్వడం కుదరదని, కచ్చితంగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని సీబీఐ కోర్టు 15 రోజుల క్రితం స్పష్టం చేసినా ఇప్పటి వరకు రెండు శుక్రవారాల కాలం జగన్ కోర్టుకు హాజరు కాలేదు. అందుకు కారణాలను కోర్టుకు విన్నవించారు జగన్ తరపు న్యాయవాది.ఈ కేసులో తదుపరి విచారణ డిసెంబర్ 6వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.