కరోనా భయంతో సీఎం ఇళ్లు దాటరు.. విద్యార్థులు మాత్రం పరీక్ష రాయాలా: జగన్కు లోకేష్ సూటి ప్రశ్న
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని తప్పుబట్టారు టీడీపీ జాతీయ కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జగన్ సర్కార్ పరీక్షలు నిర్వహించాలన్న మొండి ఆలోచనను విరమించుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.ఇప్పటికే కొన్ని వేలమంది విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షలు రద్దు చేయడం లేదా వాయిదా వేయడం చేయాలని డిమాండ్ చేస్తున్నారని లోకేష్ గుర్తుచేశారు.కరోనా వైరస్ సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉందని అలాంటి సమయంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తే చాలామంది మహమ్మారి బారిన పడే అవకాశాలున్నాయని లోకేష్ అన్నారు.
నేను లేఖ రాశాను.. అందుకే మొండిగా..
పరీక్షల విషయమై జగన్ ప్రభుత్వానికి తాను లేఖ రాశాకే... పరీక్షల నిర్వహణపై మరింత మొండిగా జగన్ ప్రభుత్వం వెళుతోందని మండిపడ్డారు నారా లోకేష్. ఈ సర్కార్కు విద్యార్థులు క్షేమంగా ఉండటం ఇష్టం లేదని అందుకే కరోనా విజృంభిస్తున్నప్పటికీ వారి ఆరోగ్యంను సైతం ప్రమాదంలోకి నెట్టివేస్తోందని విరుచుకుపడ్డారు. పరీక్ష కేంద్రాల్లో తగు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా కష్టంగా మారుతుందని చెప్పారు. అంతేకాదు కరోనా జాగ్రత్త చర్యలు అమలు చేస్తూ పరీక్షలు నిర్వహించడం చాలా కష్టమని దీనిపై ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయడం లేదని లోకేష్ ప్రశ్నించారు. ఆరడుగుల దూరంలో విద్యార్థులకు సీట్లు కేటాయించాల్సి వస్తే పరీక్ష హాలులో ఆరుగురు విద్యార్థుల కంటే ఎక్కువగా కూర్చోబెట్ట రాదని లోకేష్ అన్నారు.
కొన్ని లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే గదికి ఆరుమందిని ఉంచితే మనకున్న వనరులు సరిపోవని అన్నారు టీడీపీ యువనేత. ఇక కరోనా తొలి వేవ్ సమయంలో ప్రతి కుటుంబానికి మాస్కులు అందజేస్తామని చెప్పిన జగన్ ప్రభుత్వం ఆమాట నిలబెట్టుకోలేకపోయిందని విమర్శలు సంధించారు.
ప్రాక్టికల్స్ సమయంలోనే కొందరికి కరోనా
తాను సంధించిన ప్రశ్నలకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ వెంటనే సమాధానం చెప్పాలని నారాలోకేష్ డిమాండ్ చేశారు. టీడీపీ నిర్వహించిన డిజిటల్ టౌన్ హాల్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు పరీక్షలను రద్దు చేయడమో లేక వాయిదా వేయడమో చేయాలని డిమాండ్ చేశారు. ప్రాక్టికల్స్ సమయంలోనే వ్యాధి వ్యాపించిందని కొందరు విద్యార్థులు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు.
ఇక కేవలం విద్యార్థులకే కాదని ఇంటికి వెళ్లాక తమ కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకుతోందనే విషయాన్ని లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే మరో డిజిటల్ టౌన్ హాల్ మీటింగును ఏర్పాటు చేసి విద్యార్థుల అభిప్రాయాలను సేకరిస్తామని చెప్పారు లోకేష్. అంతేకాదు మొండిగా వ్యవహరిస్తున్న వైసీపీ ప్రభుత్వంపై న్యాయపరంగా కూడా పోరాడుతామని చెప్పారు. తెలంగాణతో సహా పలు రాష్ట్రాలో 10వ తరగతి పరీక్షలు రద్దయ్యాయనే విషయాన్ని గుర్తుచేశారు. దేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల ఆరోగ్యంను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు వాయిదా వేస్తుంటే... జగన్ సర్కార్ మాత్రం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
తన నివాసం నుంచి సీఎం బయటకు రారు..
తాడేపల్లిలోని తన నివాసం నుంచి సీఎం జగన్ బయటకు రాకుండా అన్ని మీటింగులు భౌతిక దూరం పాటిస్తూ నిర్వహిస్తున్నారని మరి అదే శ్రద్ధ విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎందుకు చూపడం లేదని నారా లోకేష్ ప్రశ్నించారు. గత 48 గంటలుగా లోకేష్ అనే వ్యక్తిపై మాత్రమే వైసీపీ నేతలు మాటలతో దాడి చేస్తున్నారని... అదే సమయం విద్యార్థుల ఆరోగ్యంపై కేటాయిస్తే బాగుండేదని లోకేష్ హితవు పలికారు. విద్యార్థులపై శ్రద్ధ ఉంటే గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్ల ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించాల్సి ఉండేదని లోకేష్ అన్నారు.
పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ నిర్వహిస్తున్న క్యాంపెయిన్కు 1.5 లక్షల మంది ప్రజలు సంఘీభావం తెలిపారని అందులో 70వేల మంది తాము పరీక్షల ద్వారా కరోనా బారిన పడినట్లు చెప్పారని లోకేష్ చెప్పారు.
ప్రభుత్వం దొంగ లెక్కలు చెబుతోంది
పరీక్షలు, పరీక్ష కేంద్రాలు వైరస్కు సూపర్ స్ప్రెడర్లుగా మారే ప్రమాదం ఉందని లోకేష్ హెచ్చరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలని అన్నారు. ఇక పరీక్షలు నిర్వహించడం వల్ల మొత్తంగా 8లక్షల మంది విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు, డ్రైవర్లు కరోనా బారిన పడే ప్రమాదం ఉందని చెప్పారు. కరోనాతో రాష్ట్రం అల్లాడిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగాలని సూచించారు.
ఆస్పత్రిలో పడకల కొరత, ఆక్సిజన్ కొరతతో మృతుల సంఖ్య పెరుగుతోందన్నారు. అంతేకాదు కరోనా వైరస్ బారిప పడ్డ వారి వాస్తవ సంఖ్యను ప్రభుత్వం దాస్తోందని చెప్పిన లోకేష్... విశాఖపట్నంలో 18 మంది మాత్రమే మరణించారని తప్పుడు లెక్కలు చూపుతోందని వాస్తవానికి పరిస్థితి భిన్నంగా ఉందన్నారు.