వైజాగ్ స్టీల్ కొనేందుకు జగన్ సర్కార్ రెడీ-ప్రైవేటీకరణ మొదలుకాగానే- వాటాల కొనుగోలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం మంటలు రేపుతున్న వేళ ఏపీ ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై సాధ్యమైనంత మేర ఒత్తిడి పెంచుతున్న వైసీపీ సర్కార్.. తమ ప్రయత్నాలు విఫలమైతే మాత్రం దేశంలోనే ఎక్కడా లేని విధంగా దీని విరుగుడు ప్రయత్నాలకు పదును పెడుతోంది. దీంతో ఇప్పుడు కేంద్రం తీసుకోబోయే నిర్ణయం ఏపీపై చూపించే ప్రభావం భవిష్యత్తులో బీజేపీకి కాంగ్రెస్ తరహాలోనే డిపాజిట్లు లేకుండా చేసే అవకాశాలూ లేకపోలేదు. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓసారి ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలుపెట్టగానే ఏపీ సర్కార్ రంగంలోకి దిగనుంది.
వైజాగ్ స్టీల్పై వైసీపీ వ్యూహాలు
ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రాజకీయంగా మంటలు రేపుతున్న వేళ పార్టీలు, ప్రభుత్వాల వైఖరిలోనూ మార్పు కనిపిస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్ధల ప్రైవేటీకరణకు వేగంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క దానిపై మినహాయింపు ఇవ్వాలని కోరలేని పరిస్ధితుల్లో ఉన్న వైసీపీ సర్కార్ ఇప్పుడు కేంద్రం వద్ద లాబీయింగ్ చేసినా ఉపయోగం లేదని భావిస్తోంది. అందుకే ఎలాగో ప్రైవేటీకరణ తప్పనివేళ పార్లమెంటులో మైలేజ్ అన్నా తెచ్చుకుందామనే ప్రయత్నాల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా వైసీపీ ఎంపీల వాకౌట్తో పాటు వాయిదా తీర్మానాలు ఇవ్వడం వెనుక వ్యూహం కూడా అదే.
వైజాగ్ స్టీల్ వాటాల కొనుగోలుకు రెడీ
వైజాగ్ స్టీల్ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించేందుకు వేగంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో దాన్ని అడ్డుకునే మార్గాలు మాత్రం ఎక్కువగా కనిపించడం లేదు. దీంతో ప్రైవేటీకరణకు ప్రత్యామ్నాయాలు సూచించినా ఫలితం లేదని వైసీపీ భావిస్తోంది. తమ ప్రతిపాదనలన్ని కేంద్రం బుట్టదాఖలు చేస్తున్న నేపథ్యంలో చివరి అస్త్రంగా వైజాగ్ స్టీల్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పార్లమెంటులో 27 మంది ఎంపీలుండీ వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణను అడ్డుకోలేకపోయారన్న అపవాదు మోస్తున్న వైసీపీ.. దాన్నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ప్లాంట్ కొనుగోలు చేసేలా వ్యూహరచన చేస్తోంది. ఈ మేరకు వాటాల్ని కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
ప్రైవేటీకరణ మొదలుకాగానే కొనుగోలు ప్రతిపాదన
కేంద్రం ప్రకటించిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రస్తుతం రంగం సిద్ధమవుతోంది. అయితే అధికారికంగా ఇంకా దస్త్రాలు ముందుకు కదలలేదు. ఓసారి ప్రైవేటీకరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కాగానే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలుపై ప్రభుత్వం పరిశీలన చేస్తుందని పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి నిన్న తొలిసారి స్పష్టంగా ప్రకటించారు. దీంతో ప్రైవేటీకరణ ప్రారంభం కాగానే వైసీపీ సర్కార్ కేంద్రానికి కొనుగోలు ప్రతిపాదనల్ని చేయబోతోందని తెలుస్తోంది. ఆ తర్వాత కేంద్రం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.