ఏపీలో ఇక సంక్షేమ కోతలు ? ఇప్పటికే రేషన్ కార్డులు- త్వరలో ఆ పింఛన్లలోనూ
ఏపీలో రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా భారీ ఎత్తున సంక్షేమ పథకాల్ని అమలు చేస్తోంది. ఇందుకోసం దాదాపు లక్ష కోట్ల రూపాయల్ని ఖర్చు చేసింది. అయినా ఇంకా ఏదో మూల అసంతృప్తి కనిపిస్తూనే ఉంది. దీంతో పథకాలను అర్హులకే అందేలా చూడటం కోసం ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా సంక్షేమ పథకాల్లో అనర్హుల ఏరివేతకు సిద్దమవుతోంది. ఇప్పటికే తెల్ల రేషన్ కార్డుల్లో భారీగా కోతలు విధించిన సర్కార్... ఇప్పుడు వితంతు, ఒంటరి మహిళల పింఛన్లలో కోత విధించబోతోంది.

జగన్ సర్కార్పై సంక్షేమ భారం
ఏపీలో వైసీపీ ప్రభుత్వం రెండేళ్లుగా నవరత్నాల పేరుతో భారీ ఎత్తున సంక్షేమ పథకాల్ని అమలు చేస్తోంది. ఇందుకోసం దాదాపు లక్ష కోట్లు ఖర్చు చేసింది. ఇదే లెక్కల ఖర్చు చేస్తే వచ్చే మూడేళ్లలో మరో లక్షన్నర కోట్లు అవసరం ఉంటాయి. అదే సమయంలో ఇంత భారీ మొత్తం ఖర్చు చేస్తున్నప్పుడు దాని ప్రయోజనం ప్రభుత్వానికి ఉంటుందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్ధితి ఎదురవుతోంది. దీంతో అర్హులకే సంక్షేమం అందించేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వంపై ఆర్ధిక భారం తగ్గడంతో పాటు అభివృద్ధికి కేటాయింపులు పెరుగుతాయి. ఇందుకోసం ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

సంక్షేమ పథకాల్లో కోతలు
భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పుడు అవి కాస్తో కూస్తో దుర్వినియోగం కావడం సహజమే. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉంటాయి. అయినా కొన్నిసార్లు రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. అందుకే కొన్నిసార్లు చూసీ చూడనట్లుగా వదిలేస్తుంటారు. ఇప్పుడు ఏపీలో పరిస్ధితి అచ్చం ఇలాగే ఉంది. భారీ అంచనాలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కావడంతో ప్రజల్ని నిరాశపర్చకుండా ఉండేందుకు సంక్షేమం విషయంలో ఇప్పటివరకూ స్వేచ్ఛగా వ్యవహరించిన ప్రభుత్వం.. తాజాగా రూటు మార్చబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కోతలు తప్పవని అర్ధమవుతోంది.

8 లక్షల రేషన్ కార్డుల కోత
ఏపీలో గతేడాది వైసీపీ ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వాలు ఇచ్చిన రేషన్ కార్డులతో పాటు విపక్షాల కార్యకర్తలు, సానుభూతిపరులు తీసుకున్న రేషన్ కార్డుల్లో కోతలు పెట్టింది. ఇలా 8 లక్షల తెల్ల రేషన్ కార్డుల్లో కోత పెట్టారు. దీంతో ఈ 8 లక్షల మందికి అప్పటివరకూ తీసుకుంటున్న అమ్మఒడి పథకం కూడా దూరమైంది. ప్రభుత్వానికి 1200 కోట్ల మొత్తం ఆదా అయింది. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైనా ప్రభుత్వం మాత్రం అనర్హులను మాత్రమే తొలగించినట్లు ప్రకటించింది.

వితంతు, ఒంటరి మహిళల పెన్షన్ల కోత
ఏపీలో ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం వితంతు, ఒంటరి మహిళలకు కూడా సామాజిక పించన్లు ఇస్తోంది. ఈ పించన్లలో అనర్హులు చాలా మంది ఉన్నట్లు ప్రభుత్వం తాజాగా గుర్తించింది. దీంతో వీరికి ఇచ్చే పింఛన్లకు ఆధార్ లింక్ చేయడం ద్వారా అర్హుల సంఖ్యను తేలుస్తోంది. అనర్హులుగా తేలిన లక్ష మందిని ప్రాధమికంగా తొలగించాలని నిర్ణయించింది. ఇప్పటికే వీరికి నోటీసులు పంపుతోంది. ఇప్పటికే వీరిలో ఆరువేల మంది అనర్హులుగా తేల్చారు. మిగతా వారు కూడా అనర్హులుగా తలితే తొలగించడం ఖాయంగా కనిపిస్తోంది. అనర్హులకు జూలై 1 నుంచి పింఛన్లు నిలిపేయబోతున్నారు.












Click it and Unblock the Notifications