సాయిరెడ్డి స్ధానంలో బాబాయ్ ?- వైసీపీలో పెనుమార్పు - వీసా ఎక్స్పైర్ అంటూ టీడీపీ లీకులు
వైసీపీ మూలస్తంభాల్లో ఒకరైన ఎంపీ విజయసాయిరెడ్డి అధినేత జగన్కే కాదు ప్రస్తుతం విశాఖ వైసీపీ రాజకీయాల్లోనూ కీలకంగా ఉన్నారు. విశాఖతో పాటు ఉత్తరాంధ్రలోని మరో రెండు జిల్లాలకూ పార్టీ ఇన్ఛార్జ్ ఆయనే. వైసీపీ అధికారంలోకి రాక మునుపే విశాఖలో అడుగుపెట్టిన సాయిరెడ్డి.. ఈ ప్రాంతంలో నాయకత్వలేమితో సతమతం అవుతున్న వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. గత ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీ అభ్యర్ధిగా కూడా ఆయన పేరే వినిపించింది. కానీ చివరి నిమిషంలో మరొకరికి అవకాశం ఇచ్చారు. విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో ఇంతటి ప్రాధాన్యం కలిగిన అధికార పార్టీ నేతను వైఎస్ జగన్ త్వరలో ఆ బాధ్యతల నుంచి విముక్తి కల్పించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
విశాఖలో వైసీపీ రాజకీయం...
దశాబ్దాలుగా టీడీపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయాలు చేసిన విశాఖపట్నంలో వైసీపీ రాకతో కాంగ్రెస్ కనుమరుగైంది అప్పటి నుంచి టీడీపీ వర్సెస్ వైసీపీగా ఇక్కడి రాజకీయాలు సాగుతున్నాయి. అయితే వీరిలో వైసీపీ కంటే టీడీపీకే ఈ సాగర తీర నగరంపై ఎక్కువగా పట్టుంది. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఎంపీ సీటు గెలిచినా నగరంలోని నాలుగు సీట్లను వైసీపీ చేజార్చుకుంది.
అయితే విశాఖను రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీకి కాస్త సానుకూలత కనిపిస్తోంది. దీంతో పాటే విశాఖ రూరల్లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేల ప్రభావ కూడా నగరంపై గణనీయంగా పెరిగింది. నగరంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల్లో గంటా మౌనంగా ఉండటం, వాసుపల్లి గణేష్ వైసీపీకి మద్దతిస్తుండటం, మరో ఇద్దరు ఎమ్మెల్యేల్లో వెలగపూడి రామకృష్ణను ప్రభుత్వం టార్గెట్ చేస్తుండటంతో నగరంపై పట్టు కోసం వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఏ స్ధాయిలో ఉన్నాయో అర్ధమవుతోంది.
విశాఖపై రూరల్ ఎమ్మెల్యేల కన్ను...
విశాఖపట్నం సిటీ పరిధిలోకి వచ్చే స్ధానాల్లో గాజువాక మినహా మిగిలిన సీట్లలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా వీరిలో సగం మంది పార్టీకి దూరమయ్యారు. మరో ఇద్దరిని నయానో భయానో దారికి తెచ్చుకునేందుకు వైసీపీ శ్రమిస్తో్ంది. ఈ నేపథ్యంలో వైసీపికి చెందిన రూరల్ ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీతో పాటు ఇతరులు కూడా విశాఖపై కన్నేశారు. రాజధాని అవుతున్న నేపథ్యంలో నగర రాజకీయాలను శాసించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇది వైసీపీలో చిచ్చుకు కారణమవుతోంది. అప్పటివరకూ నగరంలో వైసీపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నవారికి ఇది కంటగింపుగా మారింది. వీరిలో అసెంబ్లీ ఇన్ఛార్జ్లతో పాటు పార్టీ తరఫున ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు.
సాయిరెడ్డి వర్సెస్ వైసీపీ ఎమ్మెల్యేలు
విశాఖ నగరం విషయంలో రూరల్ ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై విజయసాయిరెడ్డి బహిరంగంగానే మండిపడ్డారు. జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్న సందర్భంగా నగరంలో పలు కొత్త వివాదాలొస్తున్నాయి. ఇందులో మన ఎమ్మెల్యేల పాత్రపైనే ఫిర్యాదులు వస్తున్నాంటూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రూరల్ ఎమ్మెల్యేలు అయిన గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ వంటి వారికి మంటపుట్టించాయి. దీంతో వీరిద్దరూ సాయిరెడ్డి తీరుపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.
ఈ పంచాయతీ కాస్తా అధినేత జగన్ వద్దకు చేరడంతో ముగ్గురినీ పిలిపించి సర్ది చెప్పి పంపించారు. అనంతరం సాయిరెడ్డి మీటింగ్ పెట్టి అందరూ కలిసి పనిచేద్దామంటూ ఆఫర్ చేశారు. అయినా వీరిలో అసంతృప్తి మాత్రం తొలగిపోలేదు. దీంతో ఇప్పుడు సాయిరెడ్డిని తొలగిస్తారా లేదా అంటూ ఏకంగా అధినేత జగన్ వద్దే పంచాయతీ పెట్టినట్లు సమాచారం.
సాయిరెడ్డి స్ధానంలో సుబ్బారెడ్డికి ఛాన్స్
విశాఖ వైసీపీ వ్యవహారాల్లో విజయసాయిరెడ్డి వర్సెస్ వైసీపీ ఎమ్మెల్యేలుగా మారుతున్న పరిస్దితుల్లో ఏదో ఒక చర్య తీసుకోక తప్పని పరిస్దితి ఇప్పుడు అధినేత జగన్ ముందుంది. దీంతో ఆయన ప్రస్తుతం ఉత్తరాంధ్ర వైసీపీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్న విజయసాయిరెడ్డి స్ధానంలో తన బాబాయ్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి విశాఖతో పాటు ఉత్తరాంధ్ర వ్యవహారాలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. సాయిరెడ్డి స్ధానంలో సుబ్బారెడ్డిని నియమించడం ద్వారా రాజధానిగా మారుతున్న విశాఖలో వైసీపీ చిచ్చును ఆదిలోనే తెంచేయాలనే ఆలోచనతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. లేకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తప్పవని జగన్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
సాయిరెడ్డి వీసా ఎక్స్పైర్ అంటూ టీడీపీ లీకులు
ఇప్పటికే విశాఖ వ్యవహారాల్లో ఎంపీ విజయసాయిరెడ్డి జోక్యంతో మండిపడుతున్న టీడీపీ నేతలు.. తాజా వార్తలతో ఖుషీగా కనిపిస్తున్నారు. సాయిరెడ్డికి విశాఖలో వీసా ఎక్స్పైర్ అయిందంటూ ట్వీట్లు పెడుతున్నారు. వీసా రెడ్డి వైజాగ్ లో నీ వీసా ఎక్స్పెయిర్ అయ్యింది అని తాడేపల్లి కోట నుండి సమాచారం లీకయ్యింది అంట కదా...చివరి నిమిషంలో నువ్వు బాబు గారి మీద ఎన్ని చిందులు వేసినా వైజాగ్ వైకాపా మాఫియా కి కొత్త డాన్ గా మరో రెడ్డి గారి నియామకం లాంఛనమే అంటున్నారు.ఇక సూట్ కేసు సర్దేయ్ సాయి రెడ్డి అంటూ పెందుర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి చేసిన ట్విట్ ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది.