జగన్ జోస్యం నిజమవుతుందా..? మోడీ గాలానికి బాబు పడతారా..?
Recommended Video
2019 సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇందుకోసం అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే వ్యూహ ప్రతివ్యూహాలతో అడుగులు ముందుకు వేస్తున్నాయి ఆయా రాజకీయ పార్టీలు. ఇక తెలంగాణలో ముందస్తు మాట జోరందుకుంది. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ రద్దయ్యింది. తెలంగాణ అసెంబ్లీకి రాజస్తాన్, ఛత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలతోనే ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సనద్ధమవుతోంది. అయితే ఎన్నికలునవంబర్లోనే రావొచ్చని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుగా చిన్న హింట్ ఇచ్చారు. దీంతో తెలంగాణలో రాజకీయ వేడి మరింత ముదిరింది.
ఏపీని తాకుతున్న ముందస్తు ఫీవర్
తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఫీవర్ పక్కరాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ను కూడా తాకినట్లుంది. అక్కడ కూడా పాలిటిక్స్ చాలా హాట్గా మారాయి. ఓ వైపు అధికార టీడీపీ మరోవైపు ప్రతిపక్ష వైసీపీ...కొత్తగా జనసేన పార్టీ రావడంతో పోరు రసవత్తరంగా జరగొచ్చనే అంచనాలున్నాయి. ఇక ఏపీలో కూడా అసెంబ్లీ రద్దు అవ్వొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు జనవరిలోనే వస్తాయని అంతా సిద్ధంగా ఉండాలంటూ ప్రతిపక్షనేత జగన్ తన ఎమ్మెల్యేలకు సూచించడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. అయితే ఐదేళ్లు ప్రభుత్వంలో ఉంటామంటూ మొన్ననే మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. మంత్రి అయితే స్పష్టత ఇచ్చారుకానీ.. ఢిల్లీలో మాత్రం పరిణామాలు వేగంగా మారుతున్నాయట.
లోక్సభకు అసెంబ్లీకి జనవరి 2019లోనే ముహూర్తమా..?
ఇక లోక్సభకు అసెంబ్లీకి రెండింటికి ఒకేసారి ఎన్నికలు జనవరి 2019లో జరిపే యోచనలో ఉన్నట్లు జగన్ జోస్యం చెప్పారు. ఢిల్లీ నుంచి కూడా ఇదే సంకేతాలు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో ఉన్న బ్యూరోక్రాట్లు, పొలిటికల్ పార్టీలు ఇదే విషయమై చర్చించుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు ఎన్నికల నోటిఫికేషన్ కూడా నవంబర్లోనే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియ దీపావళి తర్వాత వేగం పుంజుకోనుంది.
వ్యతిరేకత ఉండటంతోనే బీజేపీ ముందస్తు మంత్రం పటిస్తోందా..?
ఇక లోక్సభ గడువు మే25,2019తో ముగుస్తుంది. అంటే ఆరునెలల్లోగా ఎప్పుడైనా ఎన్నికలు జరిపే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఇక ఇప్పుడు అసెంబ్లీ జరగనున్న నాలుగు రాష్ట్రాలు అంటే రాజస్తాన్, ఛత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, మిజోరాంలో బీజేపీపై వ్యతిరేకత ఉందని... ఇంకా ఆలస్యం చేస్తే ఆ ప్రభావం 2019లో జరిగే సాధారణ ఎన్నికలపై పడే అవకాశం ఉండటంతో లోక్సభ ఎన్నికలు కూడా జనవరిలో నిర్వహించేందుకే కేంద్రం మొగ్గు చూపుతోందనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అంతేకాదు హర్యానా మహారాష్ట్ర రాష్ట్రాలు కూడా లోక్సభ ఎన్నికల సమయంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే తెలంగాణకు కూడా జనవరిలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. అప్పటికీ అసెంబ్లీ రద్దు అయి ఇంకా ఆరునెలలు కానందున జనవరిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగొచ్చనే వాదన కూడా వినిపిస్తోంది.