ఏపీలో వాకింగ్ కోసం ప్రైవేటు స్కూళ్లు, కాలేజీ గ్రౌండ్స్-ఇమ్మని కోరిన జగన్ సర్కార్..!
ఏపీలో నడక అలవాటును ప్రోత్సహించేందుకు ప్రైవేటు విద్యాసంస్ధలు తమ గ్రౌండ్లను ప్రభుత్వానికి ఇవ్వాలని ఇవాళ కోరింది.
ఏపీలో ప్రైవేటు విద్యాసంస్ధలకు ప్రభుత్వం మరో షాకిచ్చింది. రాష్ట్రంలోని ప్రజల్లో నడక అలవాటును ప్రోత్సహించేందుకు తమ మైదానాల్ని ప్రభుత్వానికి ఇవ్వాలని ఇవాళ కోరింది. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకూ ఈ గ్రౌండ్స్ ను వాకింగ్ కోసం ఇవ్వాలని వైద్యఆరోగ్యశాఖ విద్యాసంస్ధల యాజమాన్యాల్ని కోరింది. ఇవాళ ఆయా సంస్ధల ప్రతినిధులతో సమావేశమైన వైద్యారోగ్యశాఖ కార్యదర్శి కృష్ణబాబు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని ప్రజలు ఆరోగ్యంగా జీవించేందుకు నడకను అలవాటుగా మార్చుకోవాలని వైద్యారోగ్యశాఖ కార్యదర్శి కృష్ణబాబు కోరారు.మందులతో తాత్కాలిక ప్రయోజనమే తప్ప శాశ్వత పరిష్కారానికి శారీరక శ్రమే పరిష్కారమని ఆయన తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంలో నడక అలవాటును ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇవాళ ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు, ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

1990లో రాష్ట్రంలో అసాంక్రమిక వ్యాధులు (అంటువ్యాధులు కానివి) 30 శాతంగా ఉంటే ఇప్పుడు 63 శాతానికి పెరిగిపోయాయని కృష్ణబాబు ఆందోళన వ్యక్తం చేశారు. వీటి వల్ల రాష్ట్రంలో 68 శాతం మరణాలు సంభవిస్తున్నట్లు గుర్తించారు. బీపీ, షుగర్, గుండెజబ్బులకు కారణం ఇదేనన్నారు. వీటిని నియంత్రించేందుకు రాష్ఠ్రంలో నడక అలవాటును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కృష్ణబాబు తెలిపారు. ప్రభుత్వ ప్రతిపాదనకు ప్రైవేటు విద్యాసంస్ధలు కూడా అంగీకరించాయన్నారు. రెండు, మూడు రోజుల్లోగా విద్యాసంస్ధలు తమ గ్రౌండ్స్ వాకింగ్ కు ఇవ్వడంపై అభిప్రాయాలు తెలియజేస్తే వాటిని పరిశీలించి మార్గదర్శకాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications