ఇళ్ల స్ధలాలపై మరో ఝలక్ ?-కోడి కత్తి సీన్ రిపీట్-డిఫెన్స్ లో వైసీపీ- అసలేం జరుగుతోంది ?
ఏపీలో ఇళ్ల స్ధలాల వివాదం నానాటికీ ముదురుతోంది. ఇళ్ల స్ధలాల విషయంలో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టిన నేపథ్యంలో దీన్ని రాజకీయంగా వాడుకునేందుకు విపక్ష టీడీపీ పావులు కదుపుతోంది. దీంతో రెండేళ్ల క్రితం నాటి కోడి కత్తి వ్యవహారం తెరపైకి వస్తోంది. అప్పట్లో కోడి కత్తి దాడి బాధితుడైన వైఎస్ జగన్ పై తానే దాడి చేయించుకున్నాడని ఆరోపణలు చేసిన టీడీపీ.. ఇప్పుడు ఇళ్ల స్ధలాల విషయంలోనూ ఆలస్యం చేసేందుకు తమ వారితో హైకోర్టులో పిటిషన్లు వేయిస్తున్నారని ఆరోపిస్తోంది. దీంతో వైసీపీ డిఫెన్స్ లో పడుతోంది.
ఏపీలో ఇళ్ల స్ధలాల పథకం
ఏపీలో వైసీపీ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ల పేరుతో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే దీనికి ఆదిలోనే సమస్యలు ఎదురయ్యాయి. పట్ఠణ ప్రాంతాల్లో సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర భూమి కేటాయించాలని వైసీపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని అమలు చేయడానికి ప్రభుత్వానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టింది. ఈ ఏడాది ఉగాదికి ఎట్టకేలకు ఇళ్ల స్ధలాల కేటాయింపు ప్రారంభమైంది. అందులోనూ వివాదాలు ఉన్న స్దలాల్ని సైతం కేటాయించడంతో వీటిపై కోర్టుల్లో పిటిషన్లు దాఖలవడం మొదలైంది. ఈ వ్యవహారం తలనొప్పిగా మారడంతో విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని వైసీపీ ఆరోపించడం మొదలుపెట్టింది.
ఇళ్ల స్ధలాల వివాదాలు
ఏపీలో వైసీపీ సర్కార్ ఇళ్ల స్ధలాల కేటాయింపు ఆదినుంచీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. భారీ ఎత్తున పేదలకు ఇళ్ల స్ధలాలు కేటాయిస్తున్న తరుణంలో ఇందుకు అవసరమైన భూసేకరణ అధికారులకు ఇభ్బందికరంగా మారిపోయింది. దీంతో అధికారులు ఎక్కడ ఖాళీ స్ధలం దొరికితే అక్కడ దాన్ని సేకరించి ఇళ్ల పట్టాలు ఇచ్చేశారు. ఇందులో ఆవభూములు, వివిధ దేవాలయ ట్రస్టుల భూములు, సత్రాల భూములు..ఇలా చాలా చోట్ల వివాదాలు మొదలయ్యాయి. దీంతో ప్రభుత్వం వీటిని కోర్టుల్లో ఎదుర్కొంటూనే మరోవైపు విపక్షాలపై రాజకీయంగా ఎదురుదాడి మొదలుపెట్టేసింది. విపక్షాలు ఇళ్ల స్ధలాలు అడ్డుకుంటున్నాయని ఆరోపణలు గుప్పిస్తోంది.
వైసీపీ వర్సెస్ టీడీపీ
ఇళ్ల స్ధలాల కోసం భూసేకరణ విషయంలో వైసీపీ సర్కార్ కూ, విపక్ష టీడీపీకి మధ్య మొదలైన పోరు ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రభుత్వం సేకరించిన భూములు వివాదాస్పదమైనవని, అంత తక్కువ స్ధలం ఇవ్వడమేంటని, ప్రైవేటు స్ధలాల్ని లాక్కున్నారని .. ఇలా పలు ఆరోపణలు తెరపైకి వచ్చాయి. దీంతో వైసీపీ వర్సెస్ టీడీపీగా ఈ వ్యవహారం మారిపోయింది. ఇళ్ల స్ధలాల కేటాయింపులోవైసీపీ నేతలు మామూళ్లు వసూలు చేసుకుంటున్నారంటూ మరో ఆరోపణ కూడా తెరపైకి వచ్చింది. అయినా వైసీపీ సర్కార్ వీటిని లెక్క చేయకుండా ముందుకే వెళ్లింది. దీంతో ఇళ్ల పట్టాల కేటాయింపు ప్రక్రియ పూర్తయి జగనన్న కాలనీల పేరుతో ఇళ్ల నిర్మాణం కూడా మొదలైంది.
హైకోర్టు కీలక తీర్పు
ఇళ్ల నిర్మాణం కోసం వైసీపీ సర్కార్ ఇచ్చిన స్ధలంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ ను సింగిల్ బెంచ్ విచారించింది. ఇళ్ల స్ధలాల కోసం పట్టణ ప్రాంతాల్లో సెంటు స్ధలం, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర స్ధలం కేటాయింపుపై వైసీపీ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. దీంతో ఇళ్ల స్ధలాలకు కేటాయించిన స్ధలాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెంటు భూమిలో ఇల్లు ఎలా సరిపోతుంది. ఇళ్ల స్థలాలపై ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించండి. అప్పటి వరకూ నిర్మాణాలు చేపట్టవద్దు. కన్వేయన్స్ డీడ్లు రద్దు చేసి డీ-ఫాం పట్టాలివ్వండి. మహిళలకే కాదు.. పురుషులు, ట్రాన్స్ జెండర్లకూ స్థలాలివ్వాలంటూ నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
కాదు పొమ్మన్న డివిజన్ బెంచ్
ఇళ్ల నిర్మాణంపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. డివిజన్ బెంచ్లో రాష్ట్ర ప్రభుత్వం హౌస్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వ అప్పీల్ను స్వీకరించేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. దీంతో పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చే స్ధలాలను విపక్షాలు అడ్డుకుంటున్నాయన్న ప్రచారాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. గతంలో భూసేకరణ, ఇళ్ల స్ధలాల కేటాయింపును అడ్డుకున్నారని, ఇప్పుడు ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారని వైసీపీ ఆరోపించింది.
టీడీపీ సంచలన ఆరోపణ
ఇళ్ల స్ధలాల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ వ్యవహారం న్యాయ ప్రక్రియలో భాగంగా మారిపోయింది. ఇప్పుడు హైకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగానే ఇళ్ల స్ధలాలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హైకోర్టు కాదంటే, సుప్రీంకోర్టుకు వెళ్లియినా సెంటు స్ధలంపై ఉత్తర్వులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. లేకపోతే హైకోర్టు తీర్పు ప్రకారం అదనపు స్ధలం ఇవ్వాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ ఆలస్యం కావడం ఖాయం. దీంతో టీడీపీ మరోసారి రంగంలోకి దిగింది. హైకోర్టులో పిటిషన్లు వేయించి పేదల ఇళ్ల స్ధలాల్ని అడ్డుకుంటున్నారన్న వైసీపీ ఆరోపణల నేపథ్యంలో రివర్స్ అటాక్ కు దిగింది. హైకోర్టులో పిటిషన్ వేయించిన వ్యక్తి వివరాలు సేకరించి, అతను వైసీపీ కార్యకర్తే అనే సంచలన ఆరోపణ చేసింది. దీంతో ప్రభుత్వం ఇరుకునపడుతోంది.
Recommended Video
కోడి కత్తి వ్యూహం రిపీట్ ?
గతంలో 2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేతగా ఉన్న వైఎస్ జగన్ పై కోడి కత్తితో శ్రీనివాస్ అనే వ్యక్తి దాడి చేశాడు. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం.. వెంటనే స్పందించి ఈ దాడి చేసిన శ్రీనివాస్ వైసీపీ కార్యకర్తే అని తేల్చేసింది. అప్పటి డీజీపీ ఠాకూర్ తో అదే చెప్పించింది. దీంతో వైసీపీ ఇరుకునపడింది. తమ పార్టీ అధినేత జగన్ తనపై తానే దాడి ఎందుకు చేయించుకుంటారని ప్రశ్నించింది. అయినా టీడీపీ మాత్రం ఆ ఆరోపణను వదిలిపెట్టకుండా ఎన్నికల వరకూ అదే విమర్శలు చేసింది. ఇప్పుడు సరిగ్గా మరోసారి ఇళ్ల స్ధలాల విషయంలోనూ కోడి కత్తి వ్యవహారం తరహాలోనే వైసీపీ సర్కార్ ఇళ్ల స్ధలాల పథకంపై వ్యూహాత్మక దాడి మొదలుపెట్టింది. ప్రభుత్వం తాము ఇవ్వాలనుకున్న ఇళ్ల స్ధలాలకు వ్యతిరేకంగా పిటిషన్లు వేయించి కావాలనే దీన్ని ఆలస్యం చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. దీంతో కోడి కత్తి తరహాలోనే వైసీపీ ఇక్కడ డిఫెన్స్ లో పడుతోంది. టీడీపీ ఆరోపణలపై ఎదురుదాడి చేస్తున్నా వైసీపీ గొంతుక వినిపించడం లేదు.