మళ్లీ తెరపైకి ప్రజావేదిక? హైకోర్టులో ఇరుకునపడ్డ సర్కార్! కరెక్ట్ అంటే ఆ భవనాలకూ ముప్పు?
ఏపీలో 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేపట్టిన ప్రజా వేదిక కూల్చివేత వ్యవహారం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. చంద్రబాబు ప్రభుత్వం పాలన సాగించిన ప్రజా వేదికను వైసీపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా నేలకూల్చిందంటూ టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే తక్షణ ఉపశమనం మాత్రం లభించలేదు. కానీ ఆ కేసు మాత్రం ఇంకా హైకోర్టులో పెండింగ్ లోనే ఉంది. మరో కేసుపై విచారణ చేస్తున్న హైకోర్టు ముందుకు ఈ విషయాన్ని ప్రభుత్వమే వెల్లడించింది. దీంతో మరో సమస్యలో పడింది.
ప్రజా వేదిక కూల్చివేత
2019లో వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో గతంలో టీడీపీ హయాంలో నిర్మించిన ప్రజా వేదికను కూల్చివేశారు. నదీ పరివాహక చట్టం ప్రకారం దీన్ని అక్రమ కట్టడంగా గుర్తించారు. దాదాపు ఐదుకోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ కట్టడాన్ని ఇతరత్రా అవసరాలకు వాడుకునే అవకాశం ఉన్నా అలా చేయలేదు.
కానీ దాని కంటే లోపలే ఉన్న చంద్రబాబు నివాసముంటున్న ఇంటిని మాత్రం ముట్టుకోలేదు. దీంతో ప్రజా వేదిక కూల్చివేత వ్యవహారం అప్పటి నుంచి కోర్టుల్లో పెండింగ్ లో ఉంది. తాజాగా ఇది హైకోర్టులో మరోసారి తెరపైకి వచ్చింది.
స్కూళ్లలో అక్రమ కట్టడాలు
ఏపీలోని పలు పాఠశాలల్లో ప్రభుత్వం సచివాలయాల్ని, రైతు భరోసా కేంద్రాల్ని ఏర్పాటు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది. దీంతో హైకోర్టు ఈ వ్యవహారాన్ని ఆపాలని ఆదేశాలు ఇచ్చింది. కానీ అధికారులు ఇవేవీ పట్టించుకోలేదు.
రూ.40 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణాలు యథేచ్ఛగా పూర్తి చేసేశారు. దీంతో సదరు అధికారులు కోర్టు ధిక్కార కేసును ఎదుర్కొంటున్నారు. ఈ కేసు మరోసారి హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ప్రజా వేదికను ప్రస్తావించిన హైకోర్టు
స్కూళ్లలో తాము నిర్మించవద్దని చెప్పినా వినకుండా ప్రభుత్వం రూ.40 కోట్లతో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మించడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. అలాగే వాటిని ఎందుకు అక్రమ కట్టడాలుగా పరిణించరాదని ప్రభుత్వ న్యాయవాది సుమన్ ను ప్రశ్నించింది. ఆయన అవి అక్రమ కట్టడాలేనని అంగీకరించారు. అంతే కాదు అక్రమ కట్టడాలైనా ప్రజాధనంతో నిర్మించినవి కాబట్టి ఇతర అవసరాలకు వాడుకుంటామని తెలిపారు.
వాటిని విద్యాశాఖకు ఇచ్చేస్తామన్నారు. అయితే హైకోర్టు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రజా వేదిక వ్యవహారాన్ని లేవనెత్తింది. గతంలో ప్రజా వేదికను అక్రమ కట్టడంగా గుర్తించి కూల్చేసిన ప్రభుత్వం, ఇప్పుడు స్కూళ్లలో అక్రమ కట్టడాల్ని మాత్రం ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించింది. ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు అమికస్ క్యూరీకి ప్రభుత్వ అఫిడవిట్ ను ఇచ్చింది.
జగన్ సర్కార్ ఏం చెప్పబోతోంది?
ప్రజా వేదికను అక్రమ కట్టడంగా గుర్తించి కూల్చేసిన ప్రభుత్వం, ఇప్పుడు దాన్ని సమర్ధించుకునే విషయంలో మాత్రం తడబడుతోంది. అక్రమ కట్టడం అంటూనే అప్పటి పరిస్ధితుల ఆధారంగా కూల్చేశామని ప్రభుత్వ న్యాయవాది సుమన్ నిన్న హైకోర్టుకు తెలిపారు. అయితే ఇప్పుడు ప్రజావేదిక వ్యవహారం కరెక్టేనని సర్కార్ తదుపరి విచారణలో బలంగా వాదిస్తే మాత్రం స్కూళ్లలో అక్రమ కట్టడాల విషయంలోనూ అదే పని చేయమని హైకోర్టు ఆదేశించే అవకాశముంది.
అలా కాకుండా అప్పుడు చేసింది తప్పని చెబితే ఇప్పుడు స్కూళ్ల విషయంలోనూ ఊరట లభించే అవకాశం ఉంటుంది. ఈ రెండింటిలో ప్రభుత్వం ఏది ఎంచుకుంటుందో తేలాల్సి ఉంది.