కల్తీసారాతో జంగారెడ్డిగూడెం మరణాలు ? సర్కార్ ఎదురుదాడి-మద్యం పాలసీపై చర్చ
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యనిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తామని ప్రకటించి అసలు బ్రాండ్లకు బదులు వాసిరకం మద్యాన్ని అమ్మడం మొదలుపెట్టింది. వీటిపై విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా ప్రభుత్వం ఎదురుదాడి చేస్తూ వచ్చింది. కానీ ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా తాగి దాదాపు 20 మంది చనిపోయిన వ్యవహారం ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. దీంతో ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పుకోలేక తడబడుతున్నట్లు కనిపిస్తోంది.
జంగారెడ్డిగూడెం మరణాలు
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో గత కొన్ని రోజులుగా వరుస మరణాలు చోటు చేసుకుంటన్నాయి. ముూడు, నాలుగు రోజుల వ్యవధిలోనే దాదాపు 18 మంది చనిపోయారు. వీరంతా దాదాపు ఒకే లక్షణాలతో మరణించడం, వీరిని పరీక్షించిన వైద్యులు కూడా అదే విషయాన్ని ధృవీకరించడంతో కల్తీ సారా వ్యవహారం తెరపైకి వచ్చింది. మరణించిన వారంతా కొద్ది రోజులుగా కల్తీ సారా తాగుతున్నట్లు స్దానికంగా తేలింది. దీంతో కల్తీ సారా మరణాల వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.
డిఫెన్స్ లో పడ్డ ప్రభుత్వం
జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా తాగి దాదాపు 20 మంది చనిపోయిన వ్యవహారంలో ప్రభుత్వం ఇరుకున పడింది. ఇన్నాళ్లూ గతంలో ఉన్న నాటుసారా, కల్తీ సారాను అరికట్టి ప్రభుత్వమే మద్యం దుకాణాల ద్వారా మద్యం విక్రయిస్తున్నట్లు ఇన్నాళ్లూ చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు వాటిని కల్తీ సారా మరణాలుగా అంగీకరించేందుకు సిద్ధం కావడం లేదు. దీంతో వీటిని సహజమరణాలుగా చెబుతూ మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. అయినా వైద్యులతో పాటు మృతుల కుటుంబ సభ్యులు చెప్తున్న వివరాలు మాత్రం పొంతన లేకుండా ఉండటం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతోంది.
కారణాలు వదిలేసి ఎదురుదాడి
జంగారెడ్డిగూడెంలో నాలుగు రోజులుగా 18 మంది చనిపోయారని వార్తలు వస్తున్నా, ప్రభుత్వం మాత్రం దీన్ని అంగీకరించడం లేదు. అక్కడ అసలు చనిపోయింది కేవలం నలుగురేనని చెబుతోంది. విపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఎదురుదాడికి దిగుతోంది. దీంతో జంగారెడ్డిగూడెం మరణాల వ్యవహారం మిస్టరీగా మారుతోంది. గతంలో ఏలూరులోనూ మిస్టరీ మరణాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు జంగారెడ్డిగూడెంలోనూ చోటు చేసుకున్న మరణాలపై ప్రభుత్వం వాస్తవాలు చెప్పకుండా విపక్షాలు చేస్తున్న శవరాజకీయంగా పేర్కొంటూ ఎదురుదాడికి దిగుతుండటం విచిత్రంగా కనిపిస్తోంది.
మద్యం పాలసీపై చర్చ
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విధానాన్ని పలుమార్లు మార్చింది. మొత్తంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న మద్యం దుకాణాలనూ, వ్యాపారాన్ని ప్రభుత్వం పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుంది. మద్యం దుకాణాల్ని ఏటా తగ్గిస్తామంటూ ప్రచారం చేసిన ప్రభుత్వం.. రెండేళ్లుగా ఆ మాటే ఎత్తడం లేదు. ఇలాంటి సమయంలో కల్తీ సారా వల్ల మరణాలు చోటు చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ప్రభుత్వం మద్యం పాలసీలో తగిన మార్పులు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.