మరో వివాదంలో పట్టాభి- జగన్ సర్కార్ తాజా ప్లాన్-ఈసారి పిత్తబరిగెలతో-అందుకే అజ్ఞాతంలోకి ?
సీఎం జగన్, డీజీపీ గౌతం సవాంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో కేసులు ఎదుర్కొంటున్న టీడీపీ నేత పట్టాభికి తాజాగా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బలమైన ఆరోపణలు ఉన్నప్పటికీ పోలీసుల వ్యవహారశైలి కారణంగానే ఆయనకు బెయిల్ లభించిందన్న విమర్శలు వచ్చాయి. అయితే ఈ కేసుల్లో విడుదలైన ఆయనపై మరో కేసు బనాయించేందుకు వైసీపీ సర్కార్ సిద్ధమవుతోంది. ఇప్పటికే విజయనగరం జిల్లా నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టేసింది. విషయం ముందే తెలియడంతో పట్టాభి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
మరో వివాదంలో పట్టాభి
వైసీపీ సర్కార్ పై దూకుడుగా విమర్శలు చేసే క్రమంలో అదుపుతప్పిన టీడీపీ నేత పట్టాభిని వరుస కేసులు వెంటాడేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన ప్రెస్ మీట్లో చేసిన బోసడికే వ్యాఖ్యలపై స్పందించిన పోలీసులు విజయవాడకు చెందిన వ్యాపారి షేక్ మస్తాన్ ఫిర్యాదు ఆధారంగా ప్రజల మధ్య వైషమ్యాలు పెంచే వ్యాఖ్యలు చేశారంటూ కేసులు పెట్టారు. ఇందులో అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే అదే ప్రెస్ మీట్లో ఆయన చేసిన మరో వ్యాఖ్యలపైనా వైసీపీ నేతల ఫిర్యాదులతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో పట్టాభి మరో వివాదంలో చిక్కుకున్నట్లయింది.
పట్టాభి మెడకు పిత్తబరిగెలు
సీఎం జగన్, డీజీపీ సవాంగ్ పై విమర్శలు చేసేందుకు పట్టాభి పెట్టిన ప్రెస్ మీట్లోనే పిత్తబరిగెల వ్యాఖ్యలు అలవోకగా బయటికి వచ్చేశాయి. పిత్తబరిగెలు ఏరుకునే వాళ్లంటూ పట్టాభి అదే ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలపై ఇప్పడు వైసీపీ సర్కార్ దృష్టిసారిస్తోంది. ముఖ్యంగా మత్సకారుల్ని కించపరిచేలా ఉన్న ఈ వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం వైసీపీ నేతలతో ఫిర్యాదులు చేయించి మరీ కేసులు పెట్టిస్తోంది. ఇప్పటికే మత్సశాఖ మంత్రి అప్పలరాజు పట్టాభి పిత్తబరిగెల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మత్సకారుల్ని కించపరిచారంటూ మొన్న జనాగ్రహ దీక్షలో నిప్పులు చెరిగారు. ఇప్పుడు మత్సకారుల ఫిర్యాదులతో పోలీసులు కేసులు పెడుతున్నారు.
ముందే ఊహించిన పట్టాభి
సీఎం జగన్, డీజీపీలపై చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదంలో హైకోర్టు నుంచి ఒక్క రోజులోనే బెయిల్ రావడంతో సంతోషంగా ఉన్న పట్టాభి.. ఈ వ్యవహారంతో జగన్ సర్కార్ ఇగో హర్ట్ అయి ఉంటుందని ఊహించారు. దీంతో తనపై మరిన్ని కేసులు బనాయించి అరెస్టు చేయడం ఖాయమనే అంచనాకు వచ్చేశారు. ఓ కేసులో కాకుంటే మరో కేసులో తనను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించవచ్చని భయపడ్డారు. అందుకే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికి రాగానే తన ప్లాన్ ను విజయవంతంగా అమలు చేశారు.
అజ్ఞాతంలోకి పట్టాభి
అనుచిత వ్యాఖ్యల కేసులో తనను ఇరికించిన వైసీపీ సర్కార్.. ఆ తర్వాత కూడా వదిలిపెట్టదని భావించిన టీడీపీ నేత పట్టాభి అరెస్టును తప్పించుకునేందుకు వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత విజయవాడ బయలుదేరిన పట్టాభి కాన్వాయ్ ను.. గన్నవరం సమీపంలోని పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత పట్టాభి వాహనాల్ని వదిలి మిగతా కార్యకర్తల వాహనాల్ని నిలిపేశారు. దీనిపై టోల్ ప్లాజా వద్ద వాగ్వాదం కొనసాగుతుండగానే పట్టాభి అదృశ్యమయ్యారు. ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్లారన్నది కాసేపు తెలియరాలేదు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి పట్టాభి అజ్ఞాతంలోనే ఉంటున్నారు.
పిత్తబరిగెల కేసుతో పోలీసుల గాలింపు
ఇప్పుడు పిత్తబరిగెల వ్యాఖ్యలతో రాజుకున్న వివాదంలో పట్టాభిపై వరుసగా వైసీపీ నేతలతో ఫిర్యాదులు చేయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆ తర్వాత ఆయన అరెస్టు కోసం పోలీసులు రంగంలోకి దిగే అవకాశముంది. ఆ లోపు ఈ ఫిర్యాదులపై సిట్ ఏర్పాటు కానీ, లేదా ప్రత్యేక దర్యాప్తు కానీ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్దమైనా ఆశ్చర్యం లేదంటున్నారు. దీంతో పిత్తబరిగెల వ్యాఖ్యలపై పట్టాభిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తే ముందుగా ఆయన ఇంటికి వెళ్లనున్నారు. అక్కడ కనిపించకపోతే మాత్రం గాలింపు చేపట్టే అవకాశముంది. వెంటనే దొరక్కపోతే పరారీలో ఉన్నట్లు ప్రకటించే అవకాశాలూ లేకపోలేదు. దీంతో టీడీపీ నేతలు కూడా అప్రమత్తమవుతున్నారు.
Recommended Video
విజయవాడ కూడా సురక్షితం కాదా?
అనుచిత వ్యాఖ్యల కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చాక జైలు నుంచి విడుదలైన పట్టాభి నేరుగా విజయవాడలోని ఆయన నివాసానికి వస్తారని అంతా భావించారు. అయితే ఆయన మాత్రం అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారనే దానిపై పార్టీకి కూడా సమాచారం లేదు. దీంతో మరో కొత్త విషయం తెరపైకి వస్తోంది. ఇప్పటివరకూ విజయవాడను సురక్షితంగా భావించిన టీడీపీ నేతలు, పట్టాభి తాజా పరిణామాలతో తమ అభిప్రాయం మార్చుకున్నట్లు కనిపిస్తోంది. లేకపోతే నేరుగా ఇంటికి రావాల్సిన పట్టాభి ఇతర జిల్లాల్లోకి అజ్ఞాతం వెళ్లాల్సిన పనేముందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.