గవర్నర్ కార్యదర్శిపై జగన్ సర్కార్ వేటు-నో పోస్టింగ్- కొంపముంచిన ఆ అపాయింట్మెంట్ ?
గవర్నర్ కు ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకు ఉద్యోగుల నేత కేఆర్ సూర్యనారాయణకు అపాయింట్ మెంట్ లభించిన వ్యవహారంలో గవర్నర్ కార్యదర్శి ఆర్పీ సిసిడియాపై ప్రభుత్వం వేటు వేసినట్లు తెలుస్తోంది.
ఏపీలో సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆర్పీ సిసోడియాను గవర్నర్ కార్యదర్శిగా తప్పించారు. అంతే కాదు ఆయనకు పోస్టింగ్ కూడా ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇంత హడావిడిగా సిసిడియా వంటి సీనియర్ అధికారిని ఇలా తప్పించడం వెనుక ఏం జరిగిందనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గవర్నర్ కార్యదర్శిపై వేటు
ఏపీలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సిసోడియాను ఆ పదవి నుంచి తప్పించారు. అర్ధరాత్రి ఇచ్చిన జీవోలో గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా సిసోడియాను తప్పించి ఆయన స్ధానంలో మరో సీనియర్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించారు. ఆర్పీ సిసోడియా ను జీఏడి కి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే సింఘాల్ ప్రస్తుతం పనిచేస్తున్న దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా హరిజవహర్ లాల్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఈ నియామకాలు సంచలనం రేపుతున్నాయి.

సిసోడియా వేటుపై చర్చ
1991 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన ఆర్పీ సిసోడియాకు రాష్ట్రంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. పలు జిల్లాలకు కలెక్టర్ గా, ప్రభుత్వంలో కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి హోదాల్లో పలు శాఖల్లో పనిచేయడంతో పాటు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే సీఎంవోలోనూ పనిచేసిన చరిత్ర ఉంది. ఉన్నతవిద్యావంతుడు, వివాదరహితుడిగా పేరు కూడా ఉంది. నిబంధనల ప్రకారమే పనిచేస్తారనే పేరు కూడా సిసోడియాకు ఉంది. దీంతో ప్రభుత్వం గతంలో గవర్నర్ కార్యదర్శిగా ఉన్న ముకేశ్ కుమార్ మీనా స్ధానంలో 2021 ఆగస్టులో ఆయన్ను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో గవర్నర్ వద్ద నియమించింది. కానీ ఇప్పుడు ఆయనపై ఆకస్మికంగా వేటు పడింది. దీంతో సిసోడియాపై వేటు వెనుక కారణాలపై చర్చ జరుగుతోంది.

కొంపముంచిన అపాయింట్ మెంట్ ?
గవర్నర్ కార్యదర్శిగా ఉన్న ఆర్పీ సిసోడియాపై ఇంత సడన్ గా వేటు వెనుక తాజాగా చోటు చేసుకున్న ఓ కీలక పరిణామం కారణంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలోని బృందం జీతాల ఆలస్యంపై గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు అపాయింట్ కోరింది. వారికి గవర్నర్ అపాయింట్ మెంట్ లభించడం, వారు కలిసి ఫిర్యాదు చేయడం కూడా జరిగిపోయింది. దీంతో ప్రభుత్వంపై గవర్నర్ కు ఉద్యోగులు చేసిన ఫిర్యాదు సర్కార్ ప్రతిష్టను మసకబార్చింది. దీంతో ప్రభుత్వం తక్షణ చర్యగా కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలోని ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి షోకాజ్ నోటీసు పంపింది. దీంతో సూర్యనారాయణ కూడా అంతే దీటుగా హైకోర్టును ఆశ్రయించి పోరాడుతున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారానికి ఆయనకు లభించిన గవర్నర్ అపాయింట్ మెంటే కీలకంగా భావిస్తున్న ప్రభుత్వం గవర్నర్ కార్యదర్శి చొరవ లేకుండా ఇది జరగదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సిసిడియాపై వేటు పడినట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications