వైసీపీ ప్రజాప్రతినిధులకు జగన్ షాక్-కుటుంబ సభ్యుల్ని తెస్తే క్రిమినల్ చర్యలే-ఆదేశాలు జారీ
ఏపీలో వైసీపీ సర్కార్ ఇవాళ ఓ కీలక మైన ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తమ ప్రజాప్రతినిధులపై వస్తున్న ఫిర్యాదుల్ని దృష్టిలో ఉంచుకని కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఆ మేరకు పంచాయతీరాజ్ శాఖతో ఆదేశాలు ఇప్పించింది. ఇప్పటివరకూ సొంత ప్రభుత్వంలో ఎలా ఉన్నా పర్లేదని భావిస్తున్న చాలా మంది ప్రజాప్రతినిధులకు ఈ ఉత్తర్వులు భారీ షాకిచ్చాయి. దీంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించలేక, ఈ ఆదేశాల్ని తేలు కుట్టిన దొంగల్లా మౌనంగా భరించాల్సిన పరిస్దితి ఏర్పడింది.
వైసీపీ ప్రజాప్రతినిధుల నిర్వాకం
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్నికైన ప్రజాప్రతినిధులు కొందరు అధికారిక సమావేశాల్లో తమతో పాటు కుటుంబ సభ్యులను కూడా తీసుకుని వస్తున్నారు. అధికారిక సమావేశాలన్న సంగతి మర్చిపోయి వాటిలో తమ కుటుంబ సభ్యుల్ని భాగస్వాముల్ని చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా, అధికారులు హెచ్చరించినా పట్టించుకునే పరిస్ధితుల్లో లేరు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇలా జరుగుతన్న వ్యవహారాలపై ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందుతున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కావడంతో వారిపై అధికారులు కూడా వెంటనే దూకుడుగా చర్యలు తీసుకనే పరిస్దితి ఉండటం లేదు. దీంతో ఇన్నాళ్లూ వేచి చూసిన అధికారులు ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
వైసీపీ ప్రజాప్రతినిధులపై సర్కార్ సీరియస్
రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు యథేచ్చగా తమ కుటుంబ సభ్యుల్ని అధికారిక కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అధికార పార్టీ వారైనా నిబందనలకు విరుద్ధఁగా వ్యవహరిస్తే వదిలిపెట్టొద్దని సూచించారు. దీంతో అధికారులు కూడా కొరడా ఝళిపించడం మొదలుపెట్టారు.
క్రిమినల్ చర్యలకు ఆదేశాలు
ఏపీలో ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులు అధికారిక సమావేశాలలో మరియు కార్యక్రమాలలో పాల్గొనడానికి వీల్లేదంటూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఇవాళ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల్ని ఉల్లంఘించి ప్రజాప్రతినిధులు అధికారిక కార్యక్రమాలకు తమ కుటుంబ సభ్యుల్ని తీసుకొస్తే ఇకపై అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్,, జిల్లా పరిషత్ యొక్క అధికారిక సమావేశాలలో ప్రజా ప్రతినిధుల యొక్క భార్య / భర్తలు, కుటుంబ సభ్యులు, చుట్టాలు పాల్గొంటున్నారని.. అంతేగాక పంచాయతీ రాజ్ వ్యవస్థకు సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారని పలు ప్రాంతాల ప్రజలు, & స్వచ్ఛంద సంస్థలు రాష్ట్ర పంచాయతీ రాజ్ కార్యాలయం & కమీషనర్ దృష్టికి ఫిర్యాదు చేసినట్లు కలెక్టర్లకు ఆయన తెలిపారు. దీనిపై స్పందించి తాము ఈ ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు.
Recommended Video
వీరందరికీ షాక్
అధికారిక కార్యక్రమాల్లో తమ కుటుంబ సభ్యుల్ని భాగస్వాముల్ని చేయకుండా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన ప్రజాప్రతినిధుల జాబితాను కూడా పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ తన ఆదేశాల్లో పొందుపర్చారు. వీటి ప్రకారం ఇకపై ప్రజా ప్రతినిధుల (వార్డ్ సభ్యులు, సర్పంచ్, MPTC, ZPTC, MPP, ZPP) కుటుంబ సభ్యులు అధికారిక సమావేశాలలో & కార్యక్రమాలలో పాల్గొనడానికి వీల్లేదని తెలిపారు. అలా పాల్గొంటున్నారని తెలిస్తే, సంబంధిత పంచాయతీ సెక్రటరీ, MPO, MPDO, DPO, ZP CEO లపై కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ప్రకారం చర్యలు ఉంటాయని... అలాగే రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం 2018 - సెక్షన్ 37(5) ప్రకారం (women) ప్రజా ప్రతినిధుల భర్త / కుటుంబ సభ్యులు / చుట్టాలపై క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని ఆయన హెచ్చరించారు. ఇలాంటి సమస్యలు ప్రజల దృష్టికి వస్తే పంచాయతీ రాజ్ కమీషనర్ లేదా కలెక్టర్ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లవచ్చని సూచించారు.