శశికళకు నాలుగేళ్లే, జగన్కు వందేళ్లు జైలే!, ఎందుకు టార్గెట్ చేస్తున్నామంటే: కేశినేని
రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రతిపక్ష అధినేత జగనే కాబట్టి, జగనే గురించే మాట్లాడాల్సి ఉంటుందని అన్నారు.
విజయవాడ: విజయవాడ ఆర్టీవో అధికారితో వివాదం కేశినేని ట్రావెల్స్ మూసివేత వరకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆర్టీవో సుబ్రహ్మణ్యంతో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమా వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. దీంతో ఇద్దరు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి తలెత్తింది. మొత్తానికి సీఎం చంద్రబాబు జోక్యంతో క్షమాపణలు చెప్పడం, వివాదం సద్దుమణగడం జరిగిపోయాయి.
ఆ తర్వాత కొద్దిరోజులకే అనూహ్యంగా కేశినేని ట్రావెల్స్ మూతపడటం చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఆర్టీవోతో వివాదం రాజుకున్న రోజే ట్రావెల్స్ మూసివేస్తానని కేశినేని ప్రకటించినా.. అధినేత జోక్యంతో వెనక్కి తగ్గారు. అదే సమయంలో ఆయన ప్రతిపక్ష అధినేత జగన్ పై కూడా పలు విమర్శలు చేశారు. జగన్ కు చెందిన బస్సులు అక్రమంగా తిరుగుతున్నాయని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియా చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేశినేని దీనిపై ఓ ప్రశ్న ఎదురైంది. ప్రతీదానికి జగన్ను టార్గెట్ చేస్తున్నారని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. కేశినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రతిపక్ష అధినేత జగనే కాబట్టి, జగనే గురించే మాట్లాడాల్సి ఉంటుందని అన్నారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అనేక ప్రశ్నలు సంధిస్తుంటారని, వాటన్నింటికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
అయితే టీడీపీ నేతలకు జగన్ అంటే భయం కాబట్టే ఆయన్ను టార్గెట్ చేస్తున్నారనడం సరికాదని, అది పసలేని ఆరోపణ అని కేశినేని అన్నారు. సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి పనులను జగన్ సహించలేకపోతున్నారని అందువల్లే లేనిపోని కుట్రలకు పాల్పడుతున్నారని కేశినేని ఆరోపించారు. అదే సమయంలో జగన్ కేసుల విషయాన్ని కూడా ఆయన లేవనెత్తారు.
శశికళ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ చిన్న కేసులోనే శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడిందని, అలాంటిది ఏ1 ముద్దాయిగా ఉన్న జగన్కు వందేళ్లకు పైగా శిక్ష పడుతుందని కేశినేని జోస్యం చెప్పారు. మొత్తం మీద టీడీపీ జగన్ ను టార్గెట్ చేస్తూనే ఉంటుందన్నది ఆయన వ్యాఖ్యల్లో స్పష్టంగా అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications