అంత దమ్ముందా: పొన్నంపై జగ్గారెడ్డి, పిఎస్లో ఫిర్యాదు
హెలికాప్టర్ను పేల్చే దమ్ము పొన్నం ప్రభాకర్కు ఉందా? అని జగ్గారెడ్డి సవాల్ విసిరారు. ఎంపీ హోదాలో హుందాగా వ్యవహరించకుండా పోలీసులకు వార్నింగ్ ఇవ్వడం మంచిది కాదన్నారు. ట్యాంక్బండ్ సంఘటనలో కె కేశవ రావు, వివేక్, మధుయాష్కీలను తెలంగాణవాదులు చెప్పులతో కొట్టినప్పుడు పొన్నం ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
సిఎంను విమర్శించే స్థాయి పొన్నంకు లేదని, ఆయనను విమర్శఇంచి పెద్దవాడిని కావాలనుకోవడం అవివేకమన్నారు. సిఎంపై ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు సరికాదని విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ అన్నారు.
పొన్నంపై ఫిర్యాదు
పొన్నం పైన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పోలీసులకు ఫిర్యాదు అందింది. కిరణ్ హెలికాప్టర్ను పేల్చేస్తామనడంపై డిసిసి ప్రత్యేక కార్యదర్శి అంజూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో కాంగ్రెసు నాయకులు గురువారం నల్లజెండాలతో స్థానిక పోలీసు స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. ఎస్సై స్వామికి ఫిర్యాదు చేశారు. కిరణ్ సొంత నియోజకవర్గం పీలేరులో పొన్నం దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అనంతరం రాతపూర్వకంగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సోనియాను అంటే ఊరుకోం: డిఎస్
తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని పల్లెత్తు మాట అన్నా ఊరుకోమని పిసిసి మాజీ చీఫ్ డి శ్రీనివాస్ టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును హెచ్చరించారు. అదే సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి చిన్ని ఆలోచనలు మానుకోవాలని శ్రీధర్ బాబు ఇష్యూ అంశాన్ని ఉదహరిస్తూ సూచించారు. శ్రీదర్ బాబు రాజీనామా నిర్ణయాన్ని అభినందిస్తున్నానని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన రాజీనామా నిర్ణయాన్ని మార్చుకోవాలని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీధర్బాబు శాఖను మార్చడం సరికాదని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి అధిష్టానం విధేయుడననే అర్హత కోల్పోయారని అన్నారు. ఈ నెల 23 తర్వాత సీఎం కాంగ్రెస్లోనే ఉంటే 2014 సాధారణ ఎన్నికలు జరిగే వరకు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని డిఎస్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ నేతలు సయంమనం పాటించడం మంచిదని ఆయన సూచించారు.
సోనియాపై చాలా మంది ఇటలీ వనిత అని, విదేశీయురాలని చాలా రకాలుగా విమర్శించారని శ్రీనివాస్ అన్నారు. ఆమెకు భారతీయ సంస్కృతి తెలియదని, ఆమెకు ఏమీ అర్థంకాదని హాస్యాస్పదంగా విమర్శించారని ఆయన పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో, మత సామరస్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆమె పదవులు వదులుకున్నారని డిఎస్ అన్నారు. 1999లో కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నకర దిశలో ఉండగా సోనియా కృషివల్లే 2004లో అధికారంలోకి వచ్చిందని శ్రీనివాస్ కొనియాడారు.