ఆర్థిక నేరస్థుడు సిఎం ఎలా, ఆలోచించండి: జగన్పై జైరాం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన కేంద్రమంత్రి జైరాం రమేష్ బుధవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. జగన్ పైన ప్రశ్నల వర్షం కురిపించారు. జైలుకెళ్లి బెయిల్ మీద వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి ఎలా అవుతారని ప్రశ్నించారు. తీవ్ర ఆర్థిక నేరాల కేసులో జగన్ నిందితుడన్నారు. అలాంటి నిందితుడితో కొత్త రాష్ట్రం అభివృద్ధి ఎలా సాధ్యమో చెప్పాలన్నారు.
దేశంలో అన్ని పార్టీల కంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే ఖర్చు చేస్తోందన్నారు. జగన్ పార్టీ కుబేరుల పార్టీ... దొంగల పార్టీ అన్నారు. జగన్ దగ్గరఅల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందని దుయ్యబట్టారు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించిన వ్యక్తి జగన్ అని విమర్శించారు.
జగన్ తీరును చూసి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మ క్షోభిస్తుందన్నారు. ఆర్థిక నేరస్థులతో సీమాంధ్ర అభివృద్ధి అసాధ్యమన్నారు. జగన్ పార్టీ ఆలీబాబా 40 దొంగల పార్టీ అని ఎద్దేవా చేశారు. జగన్ చేతిలో ఓ అద్భుత దీపం ఉందని... అందుకే అతి తక్కువ కాలంలోనే ఎవరూ సంపాదించలేనంత సంపాదించారన్నారు.
జగన్ను ఎన్నుకుంటే అభివృద్ధి ఎలా సాధ్యమన్నారు. ఎలాంటి నేతను ఎంచుకుంటారో సీమాంధ్రులు ప్రశ్నించుకోవాలన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ పార్టీ డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తోందని ఆరోపించారు. జగన్ పార్టీ ప్రజాస్వామ్యానికే ముప్పు అన్నారు. జగన్కు మద్దతిచ్చే ముందు ఒక్కసారి ఆలోచించాలన్నారు.