బాబును కలిసిన వైసిపి ఎమ్మెల్యే: టిడిపిలోకి 6గురు జగన్ ఎమ్మెల్యేలు జంప్!
విజయవాడ: ఓ వైపు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరుతుంటే, ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది.
గురువారం ఉదయం వైసిపి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ముఖ్యమంత్రి చంద్రబాబును విజయవాడలో కలిశారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ను ముఖ్యమంత్రి వద్దకు తీసుకు వచ్చారు. ఆయన త్వరలో సైకిల్ ఎక్కవచ్చునని అంటున్నారు.
జలీల్ ఖాన్ మాత్రమే కాకుండా వైసిపికి చెందిన దాదాపు ఆరుగురు ఎమ్మెల్యేలు రాబోయే వారం పది రోజుల్లో టిడిపిలో చేరవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జలీల్ ఖాన్, ఉప్పులేటి కల్పన, మేకా ప్రతాప్ అప్పారావు, సురేశ్, కడప నుంచి ఆదినారాయణ రెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.
వారు ఎప్పుడైనా టిడిపిలో చేరవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2019 నాటికి ఏపీలో టిడిపిని బలంగా చేసుకోవడం కోసం ఇప్పటి నుంచే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రతిపక్షం నుంచి ఎమ్మెల్యేలను తీసుకునేందుకు చంద్రబాబు కూడా సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ టిడిపి వైపు చూశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆనం సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇలా వరుసగా విపక్షాల కీలక నాయకులు, వైసిపి ఎమ్మెల్యేలు టిడిపి వైపు వస్తారని అంటున్నారు.