జగన్! పార్టీ మూసేస్తారా?: చెప్పులు మెడలో వేసుకుంటానని జలీల్ ఖాన్ సవాల్
అమరావతి: తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్పై ఎమ్మెల్యేగా గెలిచి, ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరిన జలీల్ ఖాన్ ఓ తెలుగు టీవీ ఛానెల్ కు ఇచ్చారు.
ఈ ఇంటర్వ్యూలో జలీల్ ఖాన్.. వైయస్సార్ కాంగ్రెస్అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్ గ్రాఫ్ క్రమంగా తగ్గుతోందని చెప్పిన ఆయన.. ఆ కారణంగానే టీడీపీలో చేరానని స్పష్టం చేశారు.
తనకు శక్తి యుక్తి ఉంటే మంత్రి పదవి అదే వస్తుందని చెప్పారు. తనకు మంత్రి పదవి రాకున్నా ఇబ్బందేమీ లేదని తేల్చి చెప్పారు. కేవలం మంత్రి పదవి కోసమే తాను టీడీపీలో చేరలేదని కుండబద్దలు కొట్టారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచిన తాను ఆ పదవికి రాజీనామా చేసి తిరిగి గెలిచే సత్తా ఉందని జలీల్ ఖాన్ పేర్కొన్నారు. ఒకవేళ ఉప ఎన్నికలో గెలవలేకపోతే చెప్పులు మెడలో వేసుకుని తిరుగుతానని ఆయన చెప్పారు.
ఉప ఎన్నికలో తాను గెలిస్తే జగన్.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మూసేస్తారా? అని జలీల్ ఖాన్ సవాల్ విసిరారు. వైయస్సార్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్లు దుర్గ గుడి ఫ్లైఓవర్ కాంట్రాక్టులో తనకు ఎలాంటి సబ్ కాంట్రాక్టులు లేవని ఆయన స్పష్టం చేశారు.
తాను సెటిల్మెంట్లు చేసేవాడిని కాదని, కబ్జాలకు పాల్పడలేదని చెప్పారు. మంత్రి పదవి కోసమే మరో టిడిపి నేత బొండా ఉమను మించి ఆరోపణలు చేస్తున్నారా? అని ప్రశ్నించగా అలాంటిదేమి లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి, బిజెపికి జగన్ దగ్గరవ్వాలని చూస్తున్నారని అన్నారు. ఏపి అభివృద్ధి కోసం చంద్రబాబునాయుడు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications