అమరావతి జనభేరీ: బీజేపీ..జనసేన దూరం?: కారణం?: ఉద్యమంలో చంద్రబాబు సహా
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రకటన.. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా అమరావతి ప్రాంత రైతులు జనభేరీ పేరుతో భారీ ఉద్యమాన్ని చేపట్టారు. రాయపూడి సమీపంలో సీడ్ రోడ్డు వద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. తెలుగుదేశం, సీపీఐ నేతలు ఇందులో పాల్గొన్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని రాజకీయ పక్షాలు హాజరవుతాయని భావించారు. వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది.

టీడీపీ.. సీపీఐ సహా
ఈ బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ దీనికి హాజరయ్యారు. టీడీపీ లోక్సభ, రాజ్యసభ సభ్యులు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, మాజీమంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్బాబు, వంగవీటి రాధాకృష్ణ, అమరావతి పరిరక్షణ సమితి ఐక్య కార్యాచరణ సమితి నేతలు ఇందులో పాల్గొన్నారు.

ఒకే రాజధాని..
రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని ఆయా నేతలందరూ పట్టుబట్టారు. మూడు రాజధానుల వల్ల రాష్ట్రం మూడుముక్కలాటగా మారిందని విమర్శించారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల ప్రాంతీయ అసమానతలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారూ అమరావతిని మాత్రమే రాజధానిగా కోరుకుంటున్నారని, శంకుస్థాపన కార్యక్రమానికి అన్ని గ్రామాల నుంచి పవిత్ర మట్టిని, పవిత్ర జలాలను పంపించడమే దీనికి నిదర్శనమని అన్నారు. ప్రజల అభీష్ఠానికి భిన్నంగా వైఎస్ జగన్ తన పరిపాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు.
రైతుల త్యాగాన్ని విస్మరిస్తోన్న సర్కార్.
రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలను ధారాదాత్తం చేసిన అమరావతి ప్రాంత రైతుల పొట్ట కొట్టడానికే వైఎస్ జగన్.. మూడు రాష్ట్రాల ప్రతిపాదనను తెరమీదికి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఒక సామాజిక వర్గాన్ని అణచివేయాలనే ఉద్దేశంతో.. అన్ని వర్గాల ప్రజల అకాంక్షలను కాలరాస్తున్నారని భగ్గుమన్నారు. అమరావతి ప్రాంత రైతుల త్యాగాన్ని తన మూర్ఖపు ఆలోచనకు బలి ఇస్తున్నారని ఆయా నేతలు విమర్శించారు. అమరావతి నుంచి రాజధాని ప్రాంతాన్ని ఇంచి కూడా తరలించలేరని హెచ్చరించారు. అలాంటి ప్రయత్నాలను తాము అడ్డుకుని తీరుతామని అన్నారు.

మూడు రాజధానులను ఉపసంహరించాలంటూ..
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ఉపసంహరించాలంటూ తాము ఇదివరకే పలుమార్లు ముఖ్యమంత్రికి లేఖలు రాశామని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఏ ఒక్క దానికీ ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదని మండిపడ్డారు. అమరావతి ప్రాంత రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ కించపరిచారని, దానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానుల ఏర్పాటు వెనుక కుట్ర దాగి ఉందని, దాన్ని బయటపెడతామని ఆయన అన్నారు. వైఎస్ జగన్ నియంతృత్వ ధోరణి ఎక్కువకాలం కొనసాగదని చెప్పారు.

బీజేపీ, జనసేన దూరం..
జనభేరీ సభకు భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షం జనసేన సంఘీభావాన్ని ప్రకటిస్తారని భావించినప్పటికీ.. అలా జరగలేదు. ఈ రెండు పార్టీలు కూడా ఈ సభకు దూరంగా ఉన్నాయని, పాల్గొనే అవకాశం దాదాపు లేదని చెబుతున్నారు. సీపీఎం, కాంగ్రెస్ ప్రతినిధులు సభ ముగింపు సమయానికి హాజరవుతారని తెలుస్తోంది. కాంగ్రెస్ తరఫున తులసీరెడ్డి పాల్గొంటారని అంటున్నారు. సాయంత్రం 5 గంటలకు నేతలు అమరావతి రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ఈ సభలోనే ప్రకటిస్తారని సమాచారం.












Click it and Unblock the Notifications