తిరుమలలో రాపాక: జగన్ పాలనపై అదే వైఖరి..అవే కామెంట్లు: సొంత పార్టీని ఎలా మర్చిపోతానంటూ.. !
తిరుపతి: జనసేన పార్టీ రాపాక వరప్రసాద్ గురువారం ఉదయం తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ తెల్లవారు జామున వీఐపీ బ్రేక్ దర్శనం సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు ఆయనకు రంగనాయకుల మండపంలో ఆశీర్వచనాలు పలికారు. తీర్థ, ప్రసాదాలను అందజేశారు. శ్రీవారిని దర్శించుకోవడానికి బుధవారం రాత్రే ఆయన తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథిగృహంలో బస చేశారు.
స్వామివారి దర్శనాన్ని ముగించుకుని ఆలయం నుంచి వెలుపలికి వచ్చిన రాపాక వరప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనితీరుపై మరోసారి ప్రశంసలు కురిపించారు. ఆర్థిక కారణాల వల్ల మధ్యలో చదువును మానివేయదలచిన విద్యార్థులకు జగనన్న వసతి దీవెన పథకం వల్ల లబ్ది కలుగుతుందని అన్నారు. ఈ పథకం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మేలు కలుగుతుందని చెప్పారు.

రాష్ట్రంలో అధిక సంఖ్యలో పేదరికంలో ఉన్నది దళిత కుటుంబాలేనని, చదువును కొనసాగించే స్థోమత లేక ఆయా కుటుంబాలకు చెందిన విద్యార్థులు మధ్యలోనే చదువును మానేస్తున్నారని అన్నారు. ప్రతిభ ఉన్నప్పటికీ.. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక దళితులు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు రాణించలేకపోతున్నారని చెప్పారు. అలాంటి కుటుంబాాలకు చెందిన విద్యార్థులకు జగనన్న వసతి దీవెన పథకం వల్ల మేలు కలుగుతుందని అన్నారు.
Recommended Video

తాను జనసేన పార్టీలోనే కొనసాగుతున్నానని, ఆ అనుమానం ఎందుకు వచ్చిందని ఆయన విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సొంత పార్టీని తానెలా మర్చిపోగలుగుతానని వ్యాఖ్యానించారు. తాను పార్టీకి దూరంగా లేనని, ఒకట్రెండు సిద్ధాంతపరమై విభేదాలు మాత్రమే ఉన్నాయని చెప్పుకొచ్చారు. బీజేపీతో పొత్తుపై తానేమీ ఇప్పుడే మాట్లాడదలచుకోలేదని అన్నారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయడం వల్ల వెనుకబడిన ఉత్తరాంధ్ర గానీ, రాయలసీమ జిల్లాలు గానీ సమగ్రాభివృద్ధిని సాధించగలుగుతాయని చెప్పారు. ఈ విషయంలో తాను వైఎస్ జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నానని అన్నారు.












Click it and Unblock the Notifications