బాబుకు చిక్కులు ,జగన్ డైలమా: పవన్ కల్యాణ్కు ఇదే చాన్స్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సీరియస్ అయితే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్కు ఇదే మంచి అవకాశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయంపై గళమెత్తితే ప్రజల్లోకి నేరుగా చొచ్చుకుపోవడానికి వీలవుతుందని భావిస్తున్నారు.
Recommended Video

కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం మొండిచేయి చూపడంపై, ప్రత్యేక హోదాపై, ప్రత్యేక ప్యాకేజీపై, విభజన హామీలపై సమర శంఖం పూరించడానికి పవన్ కల్యాణ్కు మంచి అవకాశమని అంటున్నారు.

కేంద్రంపై చంద్రబాబు ఇలా..
కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసహనంతో, అసంతృప్తితో ఉన్నారు. టిడిపి పార్లమెంటు సభ్యులు ఆందోళన చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం తలొగ్గలేదు. అయినప్పటికీ చంద్రబాబు కేంద్రంపై తీవ్ర స్థాయిలో తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా లేరనేది అర్థమవుతోంది. బిజెపితో తెగదెంపులు చేసుకోవడానికి కూడా ఆయన సాహసించడం లేదనే మాట వినిపిస్తోంది.

జగన్ ఇలా ఉన్నారు..
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మారడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే కేంద్రంపై పోరాటానికి ఆయన సిద్దంగా లేరనే మాట వినిపిస్తోంది. ప్రత్యేక హోదాపై కూడా ఆయన గొంతు బలంగా పలకడం లేదు. చంద్రబాబు బిజెపితో తెగదెంపులు చేసుకుంటే తాను దాన్ని అవకాశంగా తీసుకోవాలని, బిజెపితో కలిసి నడవాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

నరేంద్ర మోడీ ఇలా...
తెలుగుదేశం, వైసిపి పార్లమెంటు సభ్యులు పార్లమెంటు వెలుపలా, లోపలా ఆందోళన చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దిగిరాలేదనేది తెలుస్తూనే ఉంది. మంగళవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్ సమస్యలపై పార్లమెంటులో మాట్లాడినప్పటికీ నిర్దిష్టమైన హామీలేవీ ఇవ్వలేదు. బుధవారంనాడు నరేంద్ర మోడీ పార్లమెంటులో చేసిన ప్రసంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక సమస్యలను ప్రస్తావించలేదు. అందువల్ల కేంద్రం చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి ఏదో చేస్తుందనే నమ్మకాలు కూడా లేకుండా పోయాయి.

ఈ స్థితిలో పవన్ కల్యాణ్..
ప్రస్తుత తరుణంలో పవన్ కల్యాణ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తి ప్రజల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూసుకుని పోవడానికి వీలుంటుందని భావిస్తున్నారు. చంద్రబాబు తీరును, జగన్ వైఖరిని ప్రశ్నిస్తూ ప్రజల ముందుకు వెళ్తే ఆయనకు ఎనలేని మద్దతు లభించే అవకాశం ఉందని అంటున్నారు.

పవన్ ఇలా చెప్పవచ్చు...
జగన్పై ఉన్న అవినీతి కేసులను ప్రస్తావిస్తూ కేంద్రంపై ఆయన ఒత్తిడి పెట్టలేకపోవడానికి గల కారణాలతో పవన్ కల్యాణ్ ప్రజల ముందుకు వెళ్లాలని అంటున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఒత్తిడి పెట్టలేని నిస్సహాయతకు సంబంధించి కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తుతూ ముందుకు సాగవచ్చు.

అయితే వవన్ సీరయస్ కాదని...
పవన్ కల్యాణ్ రాజకీయాల పట్ల సీరియస్గా లేరనే అభిప్రాయం రాజకీయ విశ్లేకుల నుంచి వ్యక్తమవుతోంది. కాగా, పవన్ కల్యాణ్కు స్పష్టత లేదని, ఆయన గందరగోళంలో ఉన్నారని సిపిఐ నేత నారాయణ లాంటి వారు అంటుంటే, ఆయనను తిప్పకొట్టడానికి చంద్రబాబుతో పవన్ కల్యాణ్ దోస్తీ కట్టారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications