అవమానించారేకానీ.. ఏనాడైనా గౌరవించారా? మర్యాద ఇచ్చారా?
జనసేన, టీడీపీ.. రెండు పార్టీలు తమ పొత్తులో భాగంగా బీజేపీని కూడా కలుపుకువెళ్లాలనే యోచనలో ఉన్నాయి.
ఏపీ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఇటువంటి తరుణంలో రాబోయే ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నాయి. ఇరు పార్టీల అధినేతలు ఇప్పటికే రెండుసార్లు కలిసి వీటిపై చర్చించారు. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించాల్సిన నియోజకవర్గాలేంటి? జనసేన అడుగుతున్న నియోజకవర్గాలేంటి? అన్న విషయం ఒక్కటే పెండింగ్ లో ఉంది. దీనిపై స్పష్టత వస్తే అధికారికంగా పొత్తుల గురించి ప్రకటిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బీజేపీని కూడా కలుపుకు వెళదామని
జనసేన, టీడీపీ.. రెండు పార్టీలు తమ పొత్తులో భాగంగా బీజేపీని కూడా కలుపుకువెళ్లాలనే యోచనలో ఉన్నాయి. కానీ ఆ పార్టీ నేతల నుంచి సానుకూల స్పందన వ్యక్తం కావడంలేదు. జనసేనతో తాము పొత్తులోనే ఉన్నామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. జనసేనాని పవన్ కల్యాణ్.. కరోనావల్ల తమ మధ్య భౌతిక దూరం పెరిగిందని, కరోనా తగ్గగానే తగ్గిపోతుందని చెబుతున్నారు. అధికారికంగా జనసేన, బీజేపీ పొత్తులోనే ఉన్నప్పటికీ తమ అధినేతకు ఇవ్వవల్సినంత గౌరవాన్ని, మర్యాదను ఎప్పుడిచ్చారంటూ జనసైనికులు బీజేపీ నాయకులను ప్రశ్నిస్తున్నారు.

అవమానించారేకానీ ఏనాడన్నా గౌరవించారా?
గోదావరి గర్జనకు ఆహ్వానించారా? ప్రధానమంత్రి మోడీ భీమవరం పర్యటనకు ఆహ్వానించారా? అమరావతి ప్రాంతంలో పాదయాత్ర చేస్తుంటే ఆహ్వానించారా? తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా నిర్వహించిన ప్రచారమేకానీ.. తర్వాత తమ రెండు పార్టీలు కలిసి ఏనాడైనా ఉమ్మడిగా కార్యక్రమం నిర్వహించాయా? అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. పొత్తులకు సంబంధించి జనసేన స్టాండ్ వేరుగా ఉంది. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని, ముఖ్యమంత్రి జగన్ ను గద్దె దించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకు మార్గంగా టీడీపీతో పొత్తులో వెళదామని అనుకుంటున్నారు. దీనివల్ల జనసేన పార్టీకి కూడా పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపించగలుగుతుందనేది పవన్ అభిప్రాయంగా ఉంది.

నో కామెంట్ ప్లీజ్..
తాజాగా సోము వీర్రాజు రెండు పార్టీల పొత్తుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేనతో కలిసే ఎన్నికలకు వెళతామని, జనసేనతోనే బీజేపీ ఉంటుందని ప్రకటించారు. కుటుంబ పార్టీలకు తమ పార్టీ వ్యతిరేకమని, జనసేనకు, బీజేపీకి అధికారం అప్పగిస్తే ఐదు సంవత్సరాల్లో రాజధానిని నిర్మించి చూపుతామని ప్రకటించారు. కన్నా లక్ష్మీనారాయణ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై చేసిన వ్యాఖ్యలకు స్పందించమని కోరగా ఆయన నిరాకరించారు. నో కామెంట్ అటూ మాట దాటేశారు. బీజేపీతో పొత్తున్నా లేకపోయినా టీడీపీ-జనసేన కలిసి ముందుకు సాగాలని దాదాపు నిశ్చయించుకున్నాయి. బీజేపీకి ఆప్షన్ వదిలిపెట్టారు. అయితే బీజేపీ జనసేనకు ఆప్షన్ ఇస్తున్నట్లుగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications