జనసేన ఎమ్మెల్యేలతో పవన్ వన్ టూ వన్ ..! రీజన్ ఇదే..!
ఏపీలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్య చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా కేబినెట్ భేటీల్లో సైతం సీఎం చంద్రబాబును సైతం పలు విషయాల్లో ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరుపై ఫిర్యాదులు వస్తే వాటిపైనా ప్రశ్నిస్తున్నారు. తద్వారా అధికార కూటమిలో తప్పిదాల్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు ఆయన సొంత గూటిని చక్కదిద్దుకునే పనిలో పడ్డారు.
రాష్ట్రంలో గత ఎన్నికల్లో తనతో పాటు 21 మంది ఎమ్మెల్యేల్ని గెలిపించుకున్న పవన్ కళ్యాణ్.. వారి పనితీరుపై మాత్రం ఇప్పటివరకూ పెద్దగా సమీక్షలు నిర్వహించలేదు. అయితే కూటమిలోని ఇతర పార్టీల ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులపై మాత్రం కేబినెట్, కలెక్టర్ల సదస్సులతో పాటు కూటమి భేటీల్లో ప్రశ్నిస్తున్నారు. దీంతో జనసేన ఎమ్మెల్యేల సంగతేంటన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ కావాలని పవన్ నిర్ణయించారు.

ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ నియోజక వర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టుల వివరాలు, నియోజక వర్గంలో ఉన్న సమస్యలతోపాటు పార్టీ కార్యక్రమాల నిర్వహణపై చర్చిస్తున్నారు. ఈ రోజు తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో పవన్ సమావేశం అవుతారని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.

ముందుగా అవనిగడ్డ సీనియర్ ఎమ్మెల్యే బుద్ద ప్రసాద్ తో పవన్ కళ్యాణ్ ఈ వ్యక్తిగత సమావేశాలు ప్రారంభించారు. అనంతరం
దేవ వరప్రసాద్, లోకం నాగ మాధవి, గిడ్డి సత్యనారాయణ, పంతం నానాజీ, సిహెచ్ వంశీ కృష్ణ, నిమ్మక జయకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్ లతో వన్ టూ వన్ సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపారు. అనంతరం మిగిలిన ఎమ్మెల్యేలతో రేపు సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇందులోనే పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలకు పవన్ పలు సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications